ఏపీలో మందుబాబులకు చేదు వార్త : ఇక చల్లని బీర్లు దొరకవు: కొత్త ఆలోచన ఇదే..!!
ఇది మందుబాబులకు రుచించని వార్త. చల్లని బీర్లతో సేద తీరుదామనుకొనే వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక నుండి ఏపీ మొత్తంగా చల్లటి బీర్లు అందుబాటులో ఉండవు. సంపూర్ణ మద్యపాన నిషేధం లో భాగంగా ప్రభుత్వం దశల వారీగా నిర్ణయాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా బీరు అమ్మకాల పైన కీలక నిర్ణయం తీసుకుంది. చల్లని బీరు అమ్మకాలకు ప్రభుత్వం స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. ఇకపై లిక్కర్ తరహాలోనే బీర్లు కూడా కూలింగ్ లేకుండా వినియోగదారులకు విక్రయిస్తారు. ఈ నిర్ణయం బీరు అమ్మకాల పై పడి..పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది.
చల్లని బీర్లకు ఇక చెల్లు..
ఏపీ ప్రభుత్వం ఎక్సైజ్ విధానంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చే కొత్త మద్యం విధానంలో ప్రస్తుతం అమలు చేస్తున్న అనేక మార్పులు చేస్తూ కొత్త నిర్ణయాలను ప్రతిపాదించింది. అందులో భాగంగా.. కొత్త మద్యం విధానంలో చల్లని బీరు అమ్మకాలకు ప్రభుత్వం స్వస్తి చెప్పనుంది. మద్యం దుకాణానికి వెళ్లి చల్లని బీరు కొనుక్కుని తాగుదామనుకుంటే ఇకపై సాధ్యంకాదు. ప్రభుత్వ మద్యం షాపుల్లో బీరు బాటిళ్లను కూల్ చేసే ఫ్రిడ్జ్లకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది.

దీంతో ఇకపై లిక్కర్ తరహాలోనే బీర్లు కూడా కూలింగ్ లేకుండా వినియోగదారులకు విక్రయిస్తారు. లిక్కర్కు కూలింగ్ అవసరం లేదు కాబట్టి ఎలా విక్రయించినా తీసుకుని వెంటనే తాగేందుకు వీలుంటుంది. కానీ, బీరు మాత్రం కూలింగ్ ఉండాల్సిందే. అయితే, ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటులో ఖర్చు పెరిగిపోతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దుకాణాల్లో అవసరమైన కుర్చీలు, టేబుళ్లు, ర్యాక్ల కోసం జిల్లాల్లో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇదే సమయంలో బీర్ల ద్వారా ఎక్కువ ఆదాయం ఉండే ప్రాంతాల్లో వ్యాపారులతో పాలుగా బీరు ప్రియులకు ఇది రుచించని వార్తగా మారింది.
బీర్లు లేకపోతే అమ్మకాల ప్రభావం..
మద్యం అమ్మకాల్లో బీర్లదే తొలి స్థానం. అటువంటి బీర్ల అమ్మకాల పైన ప్రభావం చూపించే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో మద్యం వ్యాపారులు సైతం ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రైవేటు లైసెన్సీల సామగ్రిని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్రిడ్జ్లు కూడా వారు ఇస్తేనే తీసుకుంటామని కొన్ని జిల్లాల్లో అధికారులు చెబుతున్నారు. కాగా అసలు ఫ్రిడ్జ్లు కొనుగోలు చేయాలా లేదా అనే దానిపై ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో ఫ్రిడ్జ్ల కొనుగోలు విషయాన్ని పక్కన పెట్టారు. కాగా, కూలింగ్ లేకపోతే బీర్ల అమ్మకాలు పడిపోయే ప్రమాదం ఉంది.
లిక్కర్ విషయంలో ఎలా ఉన్నా, బీర్లకు కచ్చితంగా కూలింగ్ అవసరం అవుతుంది. కూలింగ్ కొంత తక్కువ ఉంటేనే కొనేందుకు వినియోగదారులు ఇష్టపడరు. అలాంటిది ఇప్పుడు పూర్తిగా కూలింగ్ లేకుండా అమ్మకాలంటే బాగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఎక్సైజ్ వర్గాలు అంటున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం దీని పైన పునరాలోచన లేదని స్పష్టం చేస్తోంది. దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామనే హామీ అమల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications