కోర్టులు కూడా రద్దు చేస్తారేమో..! ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై రచ్చ రచ్చ
కేంద్ర దర్యాప్తు సంస్థ - సీబీఐ కి నో ఎంట్రీ అంటూ ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తును నిరాకరిస్తూ తీసుకున్న నిర్ణయం రచ్చగా మారింది. సీబీఐ దర్యాప్తు కోసం ఆ సంస్థకు రాష్ట్రాలు ఇచ్చే జనరల్ కన్సెంట్ ( సాధారణ సమ్మతి ) నోటిఫికేషన్ ను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యోదంతం బయటకు వస్తుందనే కారణంతోనే ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు.
ఆంధ్రప్రదేశ్ భారత్ భూభాగంలో లేదా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు విపక్ష నేతలు. దేశ వ్యవస్థలో అంతర్భాగమైన సీబీఐ కి ఎంట్రీ నిరాకరిస్తారా అంటూ ఫైరవుతున్నారు. జగన్ పై దాడి కేసులో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాబు కుట్రలకు నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు వైసీపీ లీడర్లు.

అవినీతి భయం.. అందుకే ఈ నిర్ణయం : విపక్షాల దాడి
చట్టంలోని కొన్ని లొసుగుల ఆధారంగా ఏపీ ప్రభుత్వం సీబీఐ కి నో ఎంట్రీ అంటూ ఉత్తర్వులు జారీచేయడం సరికాదంటున్నారు విపక్షనేతలు. ఐటీ దాడులు చేయొద్దు.. సీబీఐకి ఎంట్రీ ఉండొద్దనడం సరికాదంటున్నారు. కేంద్రం నిధులను అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తుంటే కేసులు పెట్టొద్దా అంటూ ప్రశ్నిస్తున్నారు. మాకు ఏసీబీ ఉంది.. మేము చూసుకుంటామనేది ముమ్మాటికి తప్పేనంటూ మండిపతున్నారు.
అయితే కేంద్ర సంస్థలపై ఏసీబీ దాడులు చేసే అవకాశముంది. దీంతో రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ స్థంస్థల్లో పనిచేస్తూ ఎవరైనా అవినీతికి పాల్పడితే ఏసీబీ సోదాలు చేసే అధికారముంటుంది. ఈనేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి అధికారాలను ఏసీబీ వినియోగించుకునేలా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఆదాయపు పన్ను శాఖ, పోర్టులు తదితర కేంద్ర విభాగాల్లో ఏసీబీ దాడులకు అస్కారముంది. ఇటీవల ఏపీలో ఐటీ దాడులను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు.. మాకు సీబీఐ అవసరం లేదు మా ఏసీబీ చూసుకుంటుందని తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. అంటే ఐటీ ఉద్యోగుల మీద.. తమకు ఎదురుతిరిగే కేంద్ర సంస్థలపైన ఏసీబీతో దాడులు చేయిస్తారేమోననే వాదనలు వినిపిస్తున్నాయి.

తప్పు చేయకుంటే ఉలిక్కిపడటమెందుకు..!
ఇవాళ సీబీఐ దర్యాప్తు వద్దంటున్నారు.. రేపు కోర్టులు కూడా రద్దు చేస్తారా అంటూ పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మేధావులు సైతం ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. పారదర్శకంగా ఉన్నామని చెబుతున్నప్పుడు సీబీఐ దర్యాప్తు పట్ల ఎందుకు ఉలిక్కిపడుతున్నారనేది మరో వాదన.

జగన్ పై దాడి కేసు మెడకు చుట్టుకుంటుందని..!
సీబీఐ దర్యాప్తు జరిగితే తాను దొరికిపోవడం ఖాయమనే భయంతో చంద్రబాబు నాయుడు ఆ సంస్థకు నో ఎంట్రీ అంటున్నారని మండిపడ్డారు వైసీపీ నేత అంబటి రాంబాబు. జగన్ పై దాడి కేసులో నిష్పక్షపాత దర్యాప్తు కోసం తమ పార్టీ డిమాండ్ చేస్తోంటే.. సీబీఐ ని నిరాకరిస్తూ ఉత్తర్వులు ఇవ్వడమేంటని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు హైదరాబాద్ నుంచి పారిపోయి విజయవాడ వచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఏనాడూ కూడ విచారణలు ఎదుర్కోలేదని.. చట్టాన్ని అపహాస్యం చేయడంలో నెంబర్ వన్ అని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
మరోనేత పార్థసారధి ఘాటైన విమర్శలు చేశారు. నాలుగున్నరయేళ్లలో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అక్రమాలు బయటపడతాయని భయపడి సీబీఐ పై ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు కోసం భూసేకరణలో అడ్డగోలు అవినీతి జరిగిందని.. కేంద్రం దృష్టి సారించడంతో బాబు భుజాలు తడుముకుంటున్నారని ధ్వజమెత్తారు. ఒక్కటని కాదు ప్రతి పథకంలోనూ అవినీతి అక్రమాలకు అంతులేకుండా పోయిందన్నారు.

అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారా? : సీపీఐ రామకృష్ణ
సీబీఐ కి సాధారణ సమ్మతి నిరాకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని సీపీఐ నేత రామకృష్ణ తప్పుబట్టారు. సీబీఐ కి నో ఎంట్రీ అంటే దానర్థం అక్రమార్కులకు బాబు కొమ్ముకాస్తున్నట్లేనని ఆరోపించారు. జగన్ దాడి కేసులో ఇంతవరకు నిజనిజాలు తేల్చకపోవడం సరికాదన్నారు. ఎమ్మెల్యే చింతమనేనికి చంద్రబాబు ఎందుకు అడ్డుకట్ట వేయడం లేదని ప్రశ్నించారు












Click it and Unblock the Notifications