తెలుగు సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం షాక్:టిక్కెట్ల ధరలపై కీలక నిర్ణయం..కావాల్సిన హీరోలకే : వకీల్ సాబ్ నుంచే..!!
అసలే కష్టాల్లో ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టిక్కెటల్ ధరల పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సినిమా నియంత్రణ చట్టం 1955 ప్రకారం జారీ చేసిన జీవోను సవరిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ లో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ విడుదల సమయంలో టిక్కెట్ల రేట్లు పెంచుకొనేందుకు ఎగ్జిబిటర్లు ప్రభుత్వాన్ని కోరారు. అయితే, అందుకు అనుమతి లభించలేదు. దీంతో..వారు హైకోర్టుకు వెళ్లగా తాత్కాలిక ఉప శమనం లభించింది.

గతంలో విధానమే కొనసాగించాలంటూ..
దీని పైన ఎగ్జిబిటర్లు కొందరు ప్రముఖులతో కలిసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసారు. గతంలో ఉన్న విధంగానే కొత్త సినిమాలు..ప్రముఖ హీరోల సినిమాల బెనిఫిట్ షో లకు అనుమతి ఇవ్వాలి..టిక్కెట్ల ధరల విషయంలోనూ సడలింపు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాల్లోని జాయింట్ కలెక్టర్లు లైసెన్సింగ్ అథారిటీగా బెనిఫిట్ షో లు, ప్రత్యేక ప్రదర్శనలకు టిక్కెట్ల దరలు పెంచుకొనే వెసులుబాటు ఇచ్చే అధికారం సైతం వారికి ఉండేది.

ప్రభుత్వం చేతిలోనే నిర్ణయం..
అయితే, ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఇక నుండి జిల్లా స్థాయిలో వారు టిక్కెట్ల ధరల పైన..బెనిఫిట్ షో ల పైన నిర్ణయం తీసుకొనే అధికారం ఉండదు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు లోబడే వారు వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రతీ సినిమా విడుదల సమయంలో ఖచ్చితంగా ఆ చిత్ర యూనిట్ ప్రభుత్వాన్ని ఒప్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అంగీకరిస్తేనే ఏ సినిమాకు టిక్కెట్ ధర పెంచాలో నిర్ణయం జరుగుతుంది. ఈ నిర్ణయంతో సినిమాలకు ఒకే విధంగా కాకుండా.. ఏ సినిమాకు ఆ సినిమా ఆధారంగా టిక్కెట్ పెంపు నిర్ణయం అమలు కానుంది.
Recommended Video

కావాల్సిన హీరోల సినిమాలకే..
గత టీడీపీ ప్రభుత్వంలో కావాల్సిన వారి సినిమాలకే బెనిఫిట్ షో లు..టిక్కెట్ల ధరల పెంపుకు అవకాశం ఇచ్చారనే వాదన రాజకీయంగా వైసీపీ నేతలు చేస్తున్నారు. టిక్కెట్ల ధరలు పెంచితే సామాన్య ప్రేక్షకుల మీద భారం పడుతుందనేది ప్రభుత్వంలోని ముఖ్యుల వాదన. అదే సమయంలో సినీ పరిశ్రమ నుండి వస్తున్న వినతులను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. ఏడాదిన్నార కాలంలో కరోనా దెబ్బకు సినీ పరిశ్రమ..సినిమా హాళ్ల నిర్వాహకులు భారీగా దెబ్బ తిన్నారని..ఈ సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మరింత ఇబ్బందులకు కారణం అవుతుందనే ఆవేదన వారిలో వ్యక్తం అవుతోంది. దీని పైన ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications