పీఆర్సీ 3 శాతమా - ఆరు శాతమా : నేడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం - తేల్చేస్తారా..!!
ఏపీ ఉద్యోగుల్లో ఆసక్తి. ఈ నెలాఖారులోగా పీఆర్సీ పైన క్లారిటీ వస్తుందని ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ..సమయం సమీపంచటంతో ఉద్యోగులంతా ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. పీఆర్సీ..పెండింగ్ డీఏ ల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజున కీలకమైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఏం తేల్చుతారోనని ఉద్యోగులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దసరా సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు.

ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణ
ఆ సమయంలో తమకు రావాల్సిన పీఆర్సీతో పాటుతా పెండింగ్ డీఏలు చెల్లించాలని.. ప్రతీ నెలా ఒకటో తేదీన జీతాలు - పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు ప్రభుత్వంలోని ముఖ్యులు సానుకూలంగా స్పందించారు. సీఎస్ ఈ అంశాల పైన చర్చలు చేస్తారని..ఈ నెలాఖరులోగానే పీఆర్సీ పైన నిర్ణయం వస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాలన్నీ కలిసి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్గా ఏర్పడి ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలపై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామంటూ ముందుకొస్తున్నాయి. ఈ కౌన్సిల్ తొలిసమావేశం మరి కొద్ది గంటల్లో జరగనుంది.

మూడు శాతం నుంచి ఆరు శాతం వరకు
కొద్ది నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. దీంతో..ఏపీ ఉద్యోగ సంఘాల పైన ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వంలోని ముఖ్యులు తాము 2019 జూలై ఒకటో తేదీ నుంచి 27 శాతం ఐఆర్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 30 శాతం పీఆర్సీ ఇవ్వటంతో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్న 27 శాతం ఐఆర్కి ఇంకో 3 శాతం ఫిట్మెంట్ ఇచ్చి 30 శాతం పీఆర్సీ అ మలు చేసే అవకాశాలున్నాయని మెజారిటీ ఉద్యోగులు చెప్తున్నారు. 30 శాతం పీఆర్సీ వల్ల తమకు పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండబోదని ఉద్యోగులు చెప్తున్నారు.

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం పై ఆసక్తి
కనీసం 33 శాతం పీఆర్సీ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం అమలవుతున్న ఐఆర్పై పెరిగే ప్రతి ఒక శాతం ఫిట్మెంట్కి అదనంగా ప్రభుత్వానికి రూ.33 కోట్లు ఖర్చవుతుంది. అలా 3 శాతం ఫిట్మెంట్కి లెక్కిస్తే అది రూ.100 కోట్లవుతుంది. అదే ఉద్యోగులు కోరుకుంటున్నట్టు 33 శాతం పీఆర్సీ ఇస్తే నెలకు అదనంగా ప్రభుత్వానికి రూ.200 కోట్ల ఖర్చవుతుంది. డీఏల రూపంలో ప్రభుత్వ చెల్లించాల్సిన మొత్తం పైన ఉద్యోగ సంఘాల నేతలు లెక్కలు చెబుతున్నారు. ఇది దాదాపుగా 12 వేల కోట్లకు పైగా ఉంది.

సీఎం జగన్ దే తుది నిర్ణయం
అయితే, ఈ రోజు జరిగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో వీటన్నింటి పైనా చర్చిస్తారా..లేక ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలు తీసుకొని సీఎస్ ఆ చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి నివేదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపావళి కానుకగా ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన ఉంటుందంటూ మరో వాదన వినిపిస్తోంది. ఇప్పుడు అంచనా వేస్తున్న విధంగా.. ఎంతో కొంత ఫిట్మెంట్ ఇచ్చి పీఆర్సీ ప్రకటిస్తే 2019 జూలై ఒకటో తేదీ నుంచి ఆ పీఆర్సీని అ మలు చేయాల్సి ఉంటుంది.
Recommended Video

ఆశగా ఉద్యోగులు ఎదురు చూపులు
దీని ప్రకారం ప్రభుత్వం మూడు శాతం ఫిట్మెంట్ ఇస్తే బకాయిలు రూ.2,800 కోట్లుగా, ఉద్యోగులు కోరుకుంటున్నట్టు ఆరు శాతం ఫిట్మెంట్ ఇస్తే బకాయిలు రూ.5,600 కోట్లకు చేరుకుంటాయి. ఇవికాకుండా తమకు వివిధ రూపాల్లో ఇంకో రూ.3,000 కోట్ల వరకు బాకీ ఉండొచ్చని ఉద్యోగులు చెప్తున్నారు. ఏపీజీఎల్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీల రూపంలో ప్రభుత్వం నుంచి ఇంకా రూ.3,000 కోట్లు రావాల్సి ఉందని వారు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications