IAS గా పరిచయం చేసుకుని పెళ్లి.. చివరికి భర్త ఆస్తులపై కన్నేసి.. ఏమైందంటే..?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక రకాలుగా మోసాలు జరుగుతున్నాయి. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లోని బదౌన్ జిల్లాలో జరిగిన షాకింగ్ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ మహిళ తాను IAS అధికారిణి అని మోసపూరిత మాటలు చెప్పి పెళ్లి చేసుకుంది. ఆ తర్వత భర్త ఆస్తులపై కన్నేసి అతడ్ని బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా భయబ్రాంతులకు గురి చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ మహిళను అరెస్ట్ చేశారు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.
నిందితురాలిని సాధనగా పోలీసులు గుర్తించారు. ఆమెను సోమవారం బదౌన్ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు జ్యూడిషియల్ కస్టడీకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు అభిషేక్ కుమార్(28).. బదౌన్ జిల్లా ఫరీద్ పూర్ ప్రాంతం బరేలీలోని పచోమీ గ్రామం.. అతను తన భార్య, ఆమె ఫ్యామిలీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో తన భార్య సాధన ఐఏఎస్ ఆఫీసర్ అని తనను నమ్మించి మోసం చేసిందన్నారు. తమను నమ్మించేందుకు ఫోర్జెడ్ డాక్యూమెంట్స్, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ ను సృష్టించిందని అన్నారు. అభిషేక్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. అభిషేక్ కుమార్, సాధన ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యారు. వారిద్దరి మధ్య స్నేహం పెరిగిన క్రమంలో.. తాను యూపీఎస్సీ క్లియర్ అయ్యానని ఐఏఎస్ గా ఎంపికయ్యానని తెలిపింది. కానీ పోస్టింగ్ కు కాస్తంత సమయం పడుతుందని పేర్కొంది. అంతేకాక జాబ్ లోకి వచ్చాక.. అభిషేక్ కు కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా సాయం చేస్తానని సాధన తెలిపింది.

అలా పెద్దల సమక్షంలో ఇద్దరి వివాహం జరిగింది. పెళ్లి అయిన ఒకటిన్నర సంవత్సరం తర్వాత సాధనపై అభిషేక్ కు అనుమానం పెరిగింది. దాంతో ఐఏఎస్ జాబ్ విషయంలో నిలదీయగా.. సాధన బెదిరింపులకు పాల్పడింది. బ్లాక్ మెయిల్ చేస్తూ అందరినీ జైలుకు పంపిస్తానని.. తనకు పెద్ద పెద్ద వాళ్లు తెలుసని స్పష్టం చేసింది. దాంతో అభిషేక్ పోలీసులను ఆశ్రయించాడు. ఇక ఈ ఘటనపై తమదైన శైలిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications