సింగపూర్ కంపెనీల ఆఫర్: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఎకరం రూ. 4 కోట్లు..!
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలోని భూములకు రెక్కలొచ్చాయి. ఎకరానికి రూ. 4 కోట్లు చెల్లించి కొనుగోలు చేసేందుకు సింగపూర్కు చెందిన సంస్ధలు ముందుకొచ్చాయి. ఏపీ ప్రభుత్వానికి పంపిన బిజినెస్ బిడ్లో కంపెనీలు ఈ ధరను పేర్కొన్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే... సింగపూర్ ప్రభుత్వానికి చెందిన సంస్ధలు అసెండాస్, సెంబ్ కార్ప్లు కలిసి ఒక కన్సార్షియంగా ఏర్పడ్డాయి. కన్సార్షియం తరఫున ఈ బిజినెస్ బిడ్ను ఏపీ ప్రభుత్వానికి పంపాయి. ఈ ధరను చూసిన ఏపీ ప్రభుత్వ వర్గాలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాయి.
రాజధాని ప్రాంతంలో భూములకు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉన్న ధరకు ఇది రెట్టింపు. రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఒక ఎకరానికి రూ.కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయిల వరకూ విక్రయాలు జరుగుతున్నట్లు గతంలో మీడియాలో కథనాలు రావడం మనం చూశాం.
రాజధాని ప్రాంత భూములపై వచ్చే ఆదాయాన్ని సింగపూర్ కంపెనీలతో పాటు ఏపీ ప్రభుత్వం పంచుకుంటాయి. ఏపీ ప్రభుత్వానికి 42 శాతం, సింగపూర్ కంపెనీలకు 58 శాతం వాటాగా ఒప్పందం కుదిరింది. ఈ బిజినెస్ బిడ్లో ప్రభుత్వం తరుపున భాగస్వామ్యం వహించేందుకు గాను అమరావతి డెవలప్మెంట్ అనే కంపెనీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
ఈ కంపెనీ సీఆర్డీఏ పరిధిలో పనిచేస్తుంది. అదే విధంగా రాజధాని నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న సింగపూర్ ప్రభుత్వ కంపెనీలు తమ తరఫున ఒక కంపెనీని నెలకొల్పనున్నాయి. ఇదిలా ఉంటే రాజధాని భూములను పారదర్శకంగా కేటాయిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
ఇందులో భాగంగా సింగపూర్ కంపెనీలు ఇచ్చిన బిజినెస్ బిడ్కు సంబంధించిన వివరాలను ఏపీ ప్రభుత్వం త్వరలో వెల్లడించనుంది. స్విస్ చాలెంజ్ విధానంలో దీనికి పోటీ బిడ్స్ను ఆహ్వానిస్తారు. అయితే ప్రభుత్వానికి-ప్రభుత్వానికి మధ్య అనుమతితో భాగంగా సింగపూర్ ప్రభుత్వ సంస్థలకు నేరుగా కేటాయించే అవకాశం ఉన్నప్పటికీ పారదర్శకత కోసం బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఈ నెల 24వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఈ పోటీ బిడ్లపై చర్చించి వాటిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. సింగపూర్ సంస్థలు పంపించిన బిజినెస్ బిడ్ను, స్విస్ చాలెంజ్ విధివిధానాలను ఇప్పటికే ఆర్థిక మంత్రి యనమల అధ్యక్షతన వేసిన ఉన్నత స్ధాయి కమిటీ పరిశీలించింది.
దీనికి ఆమోదం కూడా తెలిపింది. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని సీఆర్డీఏకి వెళ్లింది. ఆ కమిటీ కూడా ఈ విధానాన్ని ఆమోదించింది. ఆ తర్వాత అది మౌలిక వసతుల చట్టం ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన అధికారుల కమిటీ పరిశీలనకు వెళ్లింది.
అక్కడ కూడా ఆమోదం లభించడంతో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఉన్న కమిటీ దీనిని అడ్వొకేట్ జనరల్ పరిశీలనకు పంపింది. అడ్వొకేట్ జనరల్ సోమవారం తన నివేదిక సమర్పించారు. ఇందుకు అడ్వొకేట్ జనరల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, బిజినెస్ బిడ్ ఇక ముందుకు వెళ్లడమే తరువాయి అనే ప్రచారం జరుగుతోంది.
ఆ తర్వాత ఈ నెల 24న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందితే ఒక వారంలో అధికారికంగా స్విస్ చాలెంజ్ విధానం కింద సింగపూర్ బిడ్ను వెల్లడిస్తారు. అనంతరం ఈ బిడ్పై ఏవైనా సందేహాలు ఉంటే స్పందించడానికి ఒక నెల సమయాన్ని ప్రభుత్వం ఇచ్చింది.