ఎట్టకేలకు సతీష్ చంద్రకు పోస్టింగ్: ఇసుక అక్రమాల నివారణ భాధ్యత సురేంద్రబాబుకు: ప్రభుత్వం ఉత్తర్వులు..
ఏపీ ప్రభుత్వం పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. పలువురి అధికారులకు పోస్టింగ్ లు ఇచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన సతీష్ చంద్రకు దాదాపు అయిదు నెలల తరువాత పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సతీష్ చంద్రకు బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా ఆర్టీసీ ఎండిగా ఉంటూ బదిలీ అయిన సురేంద్ర బాబు కు కీలకమైన ఇసుక అక్రమాల నివారణ..ఎక్సైజ్ అక్రమాల నిరోధాల బాధ్యతలతో పాటుగా ఎస్పీఫ్ డీజీగా బాధ్యతలు కేటాయించారు.
ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోళ్లులో అవకతవకలకు పాల్పడేందుకే సురేంద్ర బాబును బదిలీ చేసారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేసాయి. అయితే, ఇప్పుడు ఆయనకు కీలక బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అదే విధంగా మరి కొందరు అధికారుల విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సతీష్ చంద్రకు పోస్టింగ్...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన సతీష్ చంద్రకు జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చింది. ఏపీలో 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కేంద్ర సర్వీసుల్లో ఉన్న సతీష్ చంద్రను రాష్ట్ర సర్వీసులకు తెచ్చుకొని మరీ..తన కార్యదర్శిగా నియమించుకున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న కాలం మొత్తం ఆయన అదే పోస్టులో కొనసాగారు. ఇక, చంద్రబాబు తాజా ఎన్నికల్లో ఓడి..జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత సతీష్ చంద్రతో పాటుగా కలిసి పని చేసిన సీఎం పేషీ అధికారులు రాజమౌళి, సాయిప్రసాద్ లకు పోస్టింగ్ లు ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
అదే పేషీలో పని చేసిన గిరిజా శంకర్ కు మాత్రం జగన్ ప్రభుత్వం కీలక పోస్టింగ్ ఇచ్చింది. ఇక, ఇప్పుడు నాలుగు నెలల కాలం తరువాత సతీష్ చంద్రకు కీలకమైన ఉన్నత విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ముఖ్యమంత్రి సలహాదారు జోక్యంతో రెండు రోజుల క్రితం ఆయన ముఖ్యమంత్రిని కలిసి..పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. దీంతో ఆయనకు తిరిగి పోస్టింగ్ పోస్టింగ్ వచ్చినట్లు సమాచారం. మరి.. మిగిలన అధికారులతో పాటుగా టీటీడీ జేఈవోగా పని చేసిన శ్రీనివాస రాజుకు ప్రభుత్వం ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.
సురేంద్ర బాబుకు కీలక బాధ్యతలు..
ఆర్టీసీ ఎండీగా పని చేస్తున్న సమయంలో ఐపీయస్ అధికారి సురేంద్ర బాబును ప్రభుత్వం బదిలీ చేసి..డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. అయితే, ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సుల్లో అవక తవకలకు అడ్డంగా ఉన్నారనే కారణంతో ఆయన్ను బదిలీ చేసారంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసాయి. ఇప్పుడు సురేంద్ర బాబుకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఎస్పీఫ్ డీజీగా పోస్టింగ్ ఇస్తూ ఇసుక అక్రమాల నిరోధం..అదే విధంగా ఎక్సైజ్ అక్రమాలను నిరోధించే బాధ్యతలను ఆయనకే అప్పగించింది.
ఇక, సీరియస్ ఐఏయస్ అధికారి జేఏఎస్వీ ప్రసాద్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. మరో ఐఏయస్ అధికారి కన్నబాబుకు గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో పాటుగా గ్రామ..వార్డు సచివాలయాల వ్యవస్థ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. ఐపీఎస్ అధికారి త్రిపాఠినీ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.












Click it and Unblock the Notifications