ఏపీలో కరెంటు వినియోగదారులకు తీపి కబురు- జూన్ 15 వరకూ గడువు...
ఏపీలో కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏప్రిల్ నెల బిల్లులను చెల్లించేందుకు ఏకంగా 45 రోజుల గడువు ఇచ్చింది. సాధారణంగా ఓసారి బిల్లు రీడింగ్ తీశాక దాన్ని చెల్లించే గడువు 15 రోజులు మాత్రమే ఉంటుంది. దీన్ని ప్రభుత్వం మూడొంతులు పెంచింది. ప్రభుత్వం తాజా ఆదేశాల ప్రకారం ఏప్రిల్ నెల కరెంటు బిల్లులను వినియోగదారులు జూన్ 15 వరకూ ఎలాంటి జరిమానా లేకుండా చెల్లించవచ్చు.
ప్రస్తుతం ఏపీలో జారీ చేస్తున్న విద్యుత్ బిల్లుపై పలు వివాదాలు నెలకొన్నాయి. కరోనా నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెల బిల్లులు చెల్లించని వినియోగదారులకు వాటి సగటుతో కొత్త బిల్లులు పంపుతున్నారు. గత నాలుగైదేళ్లలో నమోదైన సగటు ఆధారంగా వీటిని రూపొందించడం ద్వారా వినియోగదారులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతుంటే విపక్షాలు మాత్రం కరెంటు బిల్లు ముట్టుకుంటే షాక్ కొడుతుందని ఆరోపిస్తున్నాయి.
పొలంలో వరి నాట్లేసిన ఎస్పీ ... వ్యవసాయకూలీలే కాదు పోలీసులు ఫిదా !!
దీంతో కరెంటు బిల్లుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాకపోతే చెడ్డపేరు వచ్చే పరిస్ధితి తలెత్తింది. దీంతో బిల్లులను ఈఆర్సీ నిబందనల మేరకే రూపొందించామని చెబుతోంది. మధ్యేమార్గంగా వాటి చెల్లింపు గడువును వాయిదా వేయడం ద్వారా వినియోగదారులకు కాస్త వెసులుబాటు ఇచ్చింది.
విద్యుత్ బిల్లులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా 1902 నంబరుకు ఫోన్ చేసి తమ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. బిల్లుల చెల్లింపు గడువును జూన్ 15 వరకూ పెంచడం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన 18 శాతం పెనాల్టీ కూడా నష్టపోతున్నట్లు వారు గుర్తు చేస్తున్నారు.