ఏపీలో టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ - మార్గదర్శకాలు జారీ...!!
ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలతో ప్రభుత్వం జీవో నెంబర్ 47 జారీ చేసింది. ఈ నెల 31వ తేదీ నాటికి ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకొని బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. టీచర్ల రిక్వెస్టు..అడ్మినిస్ట్రేషన్ కారణాలతో బదిలీలకు అవకాశం కల్పించారు. 2023 ఏప్రిల్ నాటికి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వాళ్లందరూ బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది.
తాజా మార్గదర్శకాలు:
ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం మే 31, 2025 లేదా అంతకంటే ముందే ఉద్యోగ విరమణ చేసిన వారికి అభ్యర్ధన మేరకు బదిలీలు చేపట్టనుంది. 2022-23 విద్యా సంవత్సరం నాటికి ఒకే చోట అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసిన గ్రేడ్ -2 ప్రధానోపాధ్యాయులు..ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఇతర ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఏ మేనేజ్ మెంట్ సర్వీసులో కొనసాగుతున్నారో ఆ విభాగంలోనే బదిలీ అయ్యేలా మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చారు. టీచర్ల బదిలీలకు ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. అదేవిధంగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.

జూన్ 1 లోగా పూర్తి :
పాఠశాల విద్యా శాఖ బదిలీలు ప్రక్రియ పూర్తి చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ షెడ్యూ్ల్ ప్రకటిస్తారని పేర్కొంది. 2022 జూన్లో చివరిగా ఉద్యోగుల బదిలీ చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ఉద్యోగుల బదిలీలకు కొంత కాలం పాటు నిషేధాన్ని సడలించారు. 2021 డిసెంబర్ లో ఉద్యోగుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం బదిలీలపై పూర్తి నిషేధం తొలగించి పూర్తి స్థాయి బదిలీలకు అవకాశం కల్పించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. బదిలీలపై జూన్ ఒకటో తేదీ నుంచి మళ్లీ నిషేధం అమల్లోకి రానుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.
మున్సిపల్ టీచర్లకు మాత్రం:
ప్రాంతం ఆధారంగా స్టేషన్ పాయింట్లను కేటాయించారు. కేటగిరీ 4 ఉన్న ప్రాంతాల్లో పని చేసిన వారికి ఏడాది సర్వీసుకు 5 పాయింట్ల చొప్పున, కేటగిరీ 1,2,3 లో పని చేసిన వారికి ఏడాదికి 1,2,3 పాయింట్ల చొప్పున కేటాయించారు. ప్రత్యేక కాంపిటెంట్ అథారిటీల ద్వారా ఉపాధ్యాయుల సీనియార్టీ, వెబ్ ఆప్షన్స్ ఆధారంగా బదిలీ ప్రక్రియ కొనసాగనుంది. బదిలీ ఉత్తర్వులు కూడా ఆ స్థాయిలోనే జారీ కానున్నాయి. బదిలీల ప్రక్రియ లో ఏ ఇద్దరికి సమాన పాయింట్లు వచ్చిన వారి సీనియార్టీని పరిగణలోకి తీసుకోనున్నారు. మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీకి ప్రత్యేక మార్గదర్శకాలను విద్యా శాఖ జారీ చేయనుంది. పాత స్టేషన్ పాయింట్ల ఆధారంగానే బదిలీ ప్రక్రియ కొనసాగుతుందని..ప్రస్తుత స్టేషన్ల పాయింట్లు పరగణలోకి తీసుకోరని ప్రభుత్వం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications