జగన్ ప్రభుత్వ నిర్ణయం వెనుక-నాలుగు దశాబ్దాల నాటి అప్పు : రూ 5 వేల కోట్ల రాబడే టార్గెట్ గా..!!
ముఖ్యమంత్రి జగన్ హామీ ఇస్తే అమలు చేస్తారు. ఇదీ ఇప్పటి వరకు పార్టీ నేతలు బలంగా చెప్పే మాట. అందరిలోనూ నమ్మకం. పాదయాత్ర సమయంలో..ఎన్నికల ప్రచారంలో జగన్ పదే పదే చంద్రబాబు హాయంలో ఇంటి కోసం తీసుకున్న మూడు లక్షల రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పారు. అయితే, తాజాగా ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం దీనికి భిన్నంగా ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. చంద్రబాబు హాయంలోనే కాదు..ఎన్టీఆర్ కాలం నుంచి ఉన్న బకాయిలకు ఒన్ టైం సెటిల్ మెంట్ అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఒన్ టైం సెటిల్ మెంట్ తో ఏం జరుగుతుంది
ఒన్ టైం సెటిల్ మెంట్ ద్వారా వారితో నిర్ణీత ధర కట్టించుకొని ఎవరైతే ఇళ్లల్లో ఉంటున్నారో వారి ఆస్తులు వారికే ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఎవరైతే ప్రభుత్వం ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వస్తారో. .వారికి రిజిస్ట్రేషన్ చేసి వారినే ఇంటిని పూర్తి హక్కుదారులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని భావిస్తోంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం..వాస్తవ లబ్ధిదారులు అయితే గ్రామాల్లో రూ.10వేలు, పట్టణాల్లో రూ.15వేలు, నగరాల్లో రూ.20వేలు చెల్లించాలి.

లబ్ది దారులకు మేలు జరుగుతుందా
అదే ఇతరులు కొనుగోలు చేసుకుని ఉంటే సరిగ్గా దానికి రెట్టింపు... అంటే రూ.20వేలు, రూ.30వేలు, రూ.40వేలు కట్టాలి. ఎక్కువ ఇళ్లు చేతులు మారి ఉంటే ఇప్పుడు ప్రభుత్వానికి భారీగా అదనపు ఆదాయం వచ్చిపడుతుంది. మొత్తం 47లక్షల మంది పేదలు రుణాలు కట్టాల్సి ఉండగా... వారిలో 4.57లక్షల మంది పట్టణ ప్రాంతాల లబ్ధిదారులు ఉన్నారు. అయితే, వీటిలో ఎన్ని ఇళ్లు చేతులు మారాయి అనేది ఇప్పుడు కీలకంగా మారనుంది. సగటున ఒక్కో ఇంటికి రూ.20వేలే కట్టాల్సి వచ్చినా దాదాపు రూ.10వేల కోట్లు సర్కాకు వస్తాయి.

ఇక పూర్తిగా వారే హక్కుదారులంటూ
కనీసం సగం మంది ఈ పథకంలో డబ్బులు కట్టినా రూ.5వేల కోట్లు మూడు నెలల్లో సర్కారు ఖజానాకు జమ అవుతాయని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఈ సెటిల్మెంట్లో డబ్బు చెల్లించడం ఒక 'ఆప్షన్' మాత్రమే అని చెబుతోంది. ఈ నిర్ణయం అమల్లో ఉన్న సమస్యల పైనా చర్చ జరుగుతోంది. అప్పుడెప్పుడో ఇచ్చిన స్థలాలు, ఇళ్లు కావడంతో ఇప్పటికే చాలా ఇళ్లు చేతులు మారాయి. ప్రభుత్వం వాస్తవ లబ్ధిదారులకు మేలు చేయాలని భావిస్తే... ఇల్లు వారి అధీనంలో ఉంటేనే పట్టా వస్తుందనే విధానం అమలుచేయాలి.

తాజా నిబంధనలపైనా చర్చ
కానీ, కొనుగోలు చేసిన వారికి ఈ ఇల్లు తప్ప మరేవీ ఉండకూడదంటూ ప్రభుత్వం షరతు పెట్టింది. పక్కా ఇళ్ల ప్రారంభం నాటి నుంచి చూస్తే లబ్దిదారులు తీసుకున్న రుణం కంటే వాటిని చెల్లించకపోవటం కారణంగా పెరిగిన వడ్డీ భారంగా మారుతోంది. దీంతో..అసలు, వడ్డీ కలిపి పెద్ద మొత్తంలో ఉండటంతో ఈ ఒన్ టైం సెటిల్ మెంట్ ద్వారా లబ్ది కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. దీని పైనా విమర్శలు ఉన్నాయి. ఇక, నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పధకంలో 30 లక్షల మందికి ఇచ్చిన స్థలాలు..వాటిలో కట్టే ఇళ్లను ప్రభుత్వం ఉచితంగానే ఇస్తోంది.
Recommended Video

ఆదాయం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం..
ఇంత భారం మోస్తున్న ప్రభుత్వం ఎప్పడో దశాబ్దాల కాలం నాడు ఇల్లు కట్టుకున్న వారి నుంచి ..రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న వారి నుంచి సుమారు రూ 4,500 కోట్ల నుంచి 5 వేల కోట్ల మేర రాబడి లక్ష్యంగా ఇటువంటి నిర్ణయాలు ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇవి రాజకీయంగానూ నష్టం చేస్తాయనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే, ప్రభుత్వం మాత్రం అటువంటి వారి నుంచి మొత్తం చెల్లించమని కోరటం లేదని..అదే సమయంలో భవిష్యత్ లో భారం కాకూడదనే ఉద్దేశంతోనే తక్కువ మొత్తంతో వారికి పూర్తి సెటిల్ మెంట్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నామని చెబుతోంది. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం..తీసుకున్న నిర్ణయం పైన లబ్దిదారులు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications