తెలంగాణ బాటలో ఏపీ- వంద రూపాయలకు నాలుగు రకాల పండ్లు..
కరోనా వైరస్ లాక్ డౌన్ వేళ తెలంగాణ బాటలో ప్రజలకు తాజా పండ్లను అందించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా అటు రైతులకు, ఇటు ప్రజలకు కూడా మేలు జరుగుతుందని విజయవాడలోమంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.
ఏపీలో పండ్ల పంపిణీ పథకం..
ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా పండ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. ఎక్కడి పండ్లు అక్కడే తోటల్లోనే ఉండిపోవాల్సిన పరిస్దితి. మరోవైపు సాధారణ ప్రజలకు కూరగాయలతో పాటే పండ్లు కూడా అందకుండాపోతున్నాయి. దీంతో ప్రభుత్వం ప్రజలతో పాటు రైతులకూ మేలు చేసే విధంగా వంద రూపాయలకే నాలుగు రకాల పండ్లను కిట్ రూపంలో అందించేందుకు సిద్ధమైంది. విజయవాడలో ఈ కొత్త పథకాన్ని రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు.

వంద రూపాయలకు పండ్ల కిట్...
రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పండ్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం వంద రూపాయలకు నాలుగు రకాల పండ్లను కిట్ రూపంలో పంపిణీ చేయనున్నారు. ఈ కిట్లను ముందుగా కరోనా రెడ్ జోన్లలో ఇంటి వద్దకే తీసుకెళ్లి ఉద్యానశాఖ ప్రతినిధులు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత ప్రజలు వీటిని తెలంగాణ తరహాలో వాట్సాప్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలి, ఏయే పండ్లను అందుబాటులో ఉంచుతున్నారన్న వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications