ప్రపంచ బ్యాంకు అప్పుకోసం జగన్ సర్కార్ : నవరత్నాలపై ఆంక్షల ప్రభావం : రాజకీయంగా నష్టమేనా..!!
ఆర్దికంగా కష్టాల ఊబిలో కూరుకుపోయిన ఏపీ ప్రభుత్వం కొత్త అప్పుల కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. సంక్షేమ పధకాల అమల్లో భాగంగా భారీగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి ఆ స్థాయిలో ఆదాయం మాత్రం సమకూరటం లేదు. ఆర్ధిక మాంధ్య పరిస్థితులకుతోడు కరోనా సంక్షోభం కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఆదాయాన్ని పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. పరిమితికి మించి అప్పులు చేస్తున్నారంటూ కూడా ప్రభుత్వంపై కేంద్రం ఆంక్షలు విధిస్తోంది.

ప్రపంచ బ్యాంకు రుణమే ఆదుకుంటుందా
తాజాగా, కేంద్రం రుణ సేకరణ పరిమితిలో కొంత మేర మినహాయింపులు ఇచ్చినా.. అవి ఏపీ ప్రభుత్వానికి తాత్కాలిక ఉపశమనమే. దీంతో.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం ప్రపంచబ్యాంక్ ను సంప్రదిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, ప్రపంచ బ్యాంకు నుంచి రుణం పొందాలంటే ఎంపిక చేసిన రంగాలతో పాటుగా.. అనేక షరతులకు అంగీకరించాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగా..పరోక్షంగా ప్రజల పైన భారాలు వేయక తప్పని పరిస్థితులు ఏర్పుడుతాయి. అయితే, ప్రభుత్వం వీటన్నింటికి సిద్ద పడే ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.

కొత్త ఆంక్షల అమలుకు సిద్దమేనా
కీలకమైన వ్యవసాయం..విద్య..వైద్య రంగాలకు సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణాలను మంజూరు చేస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ మూడు రంగాల్లో తీసుకున్న నిర్ణయాలు..అమలు చేస్తున్న విధానాలు పరోక్షంగా ప్రపంచ బ్యాంకు ను రుణ మంజూరుకు ఒప్పించే అంశాలుగానే గుర్తిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు మొదలు రాష్ట్ర వ్యాప్తంగా భూసమగ్ర సర్వే చేపడుతోంది. రైతులకు నగదు బదిలీ చేస్తోంది. వ్యవసాయరంగంలో చేస్తున్న ఈ పనులను చూపించి రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం పొందాలని చూస్తోంది.

కీలక రంగాల్లో నిర్ణయాలు ఆ దిశగానేనా
విద్యా రంగంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రపంచ బ్యాంక్ నుండి రూ.1875 కోట్ల రూపాయాల రుణాన్ని ఇప్పటికే తీసుకుంది. నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యా రంగంలో మార్పులు తేస్తున్నామని చెప్పి విద్యా రంగంలో మరిన్ని రుణాలను ప్రపంచ బ్యాంక్ నుంచి ఆశిస్తోంది. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయలను అంటే ఆపరేషన్ గదులను, వ్యాధి నిర్ధారణ పరీక్షల యంత్రాలను నెలకొల్పబోతున్నారు. ఇటీవల కొత్తగా వైద్య కళాశాలల ఏర్పాటు చేస్తామంటూ చేసిన ప్రకటనను కూడా ఈ నేపథ్యంలోనే చూడాలి. వీటన్నింటికీ ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం అడుగుతున్నారు.

నవరత్నాల అమలు పై ప్రభావం ఉంటుందా..
ఏపీ ప్రభుత్వం కోరిన విధంగా రుణం ఇవ్వాలంటూ ప్రపంచ బ్యాంక్ అనేక ఆంక్షలు అమలు చేయమని కండీషన్లు పెట్టటం సహజం. అదే జరిగితే ప్రధానంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నవ రత్నాల అమలు పైన ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దానితోపాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, స్కీమ్ వర్కర్ల డిమాండ్లపై వేటుపడే ప్రమాదమూ ఉంటుందని చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఉన్న ఆర్దిక ఇబ్బందుల్లో ప్రపంచ బ్యాంకు రుణం మినహా..మరో తక్షణ ప్రత్యామ్నాయం లేదనే వాదన ఉంది.
Recommended Video

రాజకీయంగానూ జగన్ పై ఒత్తిడి
అక్కడ రుణం పొందాలంటే ఖచ్చితంగా వారు విధించే షరతులను అంగీకరించాల్సిందే. అదే జరిగితే కొత్తగా ప్రజల పైన భారం పడే నిర్ణయాలు తీసుకోక తప్పదని ఆర్దిక విశ్లేషకులు చెబుతున్నారు. రుణాల కోసం ఇటువంటి నిర్ణయాలు అమలు ప్రారంభిస్తే ఖచ్చితంగా అది రాజకీయంగానూ ప్రభావం చూపిస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జగన్ తీసుకొనే నిర్ణయాల పైన రాజకీయంగా దాడి చేస్తున్న ప్రతిపక్షాలకు ఇది మరో అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది.దీంతో..ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications