భూధార్...ఎపిలో భూమికి ప్రత్యేక గుర్తింపు కార్డు; ఆధార్ తరహాలోనే...
అమరావతి: దేశవ్యాప్తంగా ప్రజలకు ఆధార్ కార్డు అమలుచేస్తున్నవిధంగానే...ఆంధ్రప్రదేశ్ లో భూమికి కూడా ఒక ప్రత్యేక గుర్తింపు కార్డును తీసుకురానున్నారు. దీనికి ఎపి ప్రభుత్వం భూధార్గా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే దీనిని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
భూముల వివరాలు స్పష్టంగా, ఖచ్చితంగా ఉండేందుకు గాను ఈ విధానాన్నిప్రవేశపెట్టాలని రెవెన్యూ శాఖ యోచిస్తున్నట్లు తెలిసింది. ముందుగా దీనిపై ప్రకటన చేసి తదనంతరం పూర్తి స్థాయిలో విధివిధానాల్నితయారుచేయాలని ఆ శాఖ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. దేశంలో నివశిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు కార్డు ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నఆధార్ తరహాలోనే ఎపిలో ప్రత్యేకించి భూముల కోసం ఈ భూధార్ ఉండబోతోంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి భూమికీ ఇకపై ఈ భూధార్ జారీ చేయనున్నారు.
ఇప్పటివరకు సర్వే నంబర్ల వారీగా ఉన్న భూముల్ని అన్నింటినీ ఈ కొత్త భూధార్ విధానానికి అనుసంధానం చేయనున్నారు. భూమి ఎవరి పేరున ఉంది, ఎంత విస్తీర్ణంలో ఎక్కడ ఉంది, దాని సరిహద్దులు, వాటి రిజిస్ట్రేషన్ నంబర్లు వంటి సమస్త వివరాలు ఈ భూధార్తో అనుసంధానం చేయనున్నారు. భవిష్యత్తులో ఈ భూములపై జరిగే ప్రతి క్రయ విక్రయాలన్నీనేరుగా ఆన్లైన్లోనే పర్యవేక్షించే అవకాశాలుంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల భూముల విషయంలో అక్రమాలు జరిగే అవకాశాలు తగ్గుతాయని, ఒకవేళ ఎక్కడైనా అవకతవకలు జరిగినా వాటిని వెంటనే గుర్తించడానికి అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఈ భూధార్ వల్ల చిన్న,సన్నకారు, మధ్య తరహా రైతుల భూములను గుర్తించవచ్చని, అలాగే భూస్వాముల భూముల వివరాలు అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. రానున్నకాలంలో వారు చెల్లిస్తున్నభూమి శిస్తు, నీటి తీరువా, నాలా పన్ను వసూళ్లకు కూడా ఈ భూధార్ ఆధారంగా ఉంటుందని అంటున్నారు. దీనివల్ల పన్నుల విషయంలో ప్రభుత్వం నష్టపోవడం ఉండదని, పైగా ఖజానాకు మరింత ఆదాయం సమకూరుతుందని రెవిన్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు.