పేదలకు ఇళ్ల పథకంపై ప్రభుత్వం తాజా నిర్ణయం..!!
ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాలనా పరంగా ప్రక్షాళన కొనసాగిస్తూనే..గత పాలన ముద్ర పూర్తిగా తొలిగించేలా వ్యవహరిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా మార్గదర్శకాలను సిద్దం చేస్తోంది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో తన మానస పుత్రికగా చెప్పుకొన్న నవరత్నాల పైన ప్రస్తుత ప్రభుత్వం కీలక నిర్ణయంతీసుకుంది. పేదల ఇళ్లపై జగన్ బొమ్మలున్న లోగోలు, వైసీపీ రంగులు నిలిపివేయాలని ఆదేశించింది.
పథకం పేరు మార్పు
రాష్ట్రంలో పేదల గృహ నిర్మాణ పథకానికి గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పేరును కొత్త ప్రభుత్వం తొలగించింది. పూర్తయిన పేదల ఇళ్లపై జగన్ బొమ్మతో ఉన్న లోగోలు అతికించడం, గత ప్రభుత్వ హయాంలో వేసిన నిర్దిష్ట రంగులను కూడా తక్షణమే నిలిపివేయాలని అన్ని జిల్లాల హౌసింగ్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. హౌసింగ్ కార్పొరేషన్ వెబ్సైట్తోపాటు, కార్పొరేషన్ ద్వారా జారీ చేసే లబ్ధిదారుల కార్డులు, పాస్పుస్తకాలు, సర్టిఫికెట్లపై కూడా జగన్ బొమ్మలు, వైసీపీ జెండా రంగులు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అదేశించింది.

పాత పేర్లతో అమలు
పేదల ఇళ్ల పథకాలకు కొత్త పేర్లు పెట్టే వరకు 2019కి ముందున్న పాత పేర్లను పునరుద్ధరించాలని హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు సూచించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పేర్లను మార్పు చేస్తూ అప్పట్లో నిర్నయం తీసుకున్నారు. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్, ఎన్టీఆర్ స్పెషల్ హౌసింగ్ పథకాలను గత ఐదేళ్లూ వైఎస్ఆర్ రూరల్ హౌసింగ్, వైఎస్ర్ స్పెషల్ హౌసింగ్ పేర్లతో అమలు చేశారు. ఈ రెండు పథకాలను మళ్లీ పాత పేర్లతోనే అమలు చేయనున్నారు.
మంత్రివర్గంలో నిర్ణయం
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఇక మీదట వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ గాఅమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన లే-అవుట్ల వద్ద వైఎస్సార్ జగనన్న కాలనీ పేరుతో స్వాగత ద్వారాలు (ఆర్చిలు) నిర్మించారు. ఇక మీదట ఈ పేర్లను కూడా నిలిపివేయనున్నారు. ఇక..ఇప్పటికే పేదలకు ఇంటి పథకం పైన మంత్రి పార్ధసారధి స్పష్టత ఇచ్చారు. త్వరలోనే పూర్తి స్థాయిలో ఇళ్ల పంపిణీ పైన నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 16న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఇళ్ల పంపిణీ పైన నిర్ణయం ఉండే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications