డ్వాక్రా మహిళలకు రూ లక్ష- ప్రభుత్వం కొత్త పథకం, కండీషన్స్ అప్లై..!!
ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం కొత్త పథకం సిద్దం చేసింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతున్న వేళ కీలక నిర్ణయాలు వెల్లడించనుంది. ఈ నెలలోనే సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన రెండింటిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో డ్వాక్రా మహిళల కోసం కొత్త ఆలోచన చేసిన ప్రభుత్వం విధి విధానాలకు తుది రూపు ఇస్తోంది. దీని ద్వారా డ్వాక్రా మహిళల పిల్లల భవిష్యత్ కు మేలు జరిగేలా మార్గదర్శకాలు సిద్దం చేసింది.
ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో పథకం అమలు కు సిద్దమైంది. డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు భరోసా ఇచ్చేలా ఈ పథకం రూప కల్పన చేసింది. డ్వాక్రా మహిళలకు 4 శాతం వడ్డీకే రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. పథకానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా నామకరణం చేసిన ప్రభుత్వం ఏటా 200 కోట్లు ఖర్చు చేసేలా ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ పథకం కింద గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటి-సెర్ప్ పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం అందించనున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఈ పథకాన్ని అమలుచేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు వర్తింపజేయనున్నారు.

త్వరలోనే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అమలులోకి తీసుకొచ్చేలా అధికారులు కసరత్తును పూర్తిచేశారు. స్త్రీనిధి నుంచి రుణంగా తీసుకునే మొత్తాన్ని పిల్లల చదువు కే వినియోగించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వారి ఫీజు చెల్లింపులు, పుస్తకాలు, యూనిఫామ్ వంటి వాటి కొనుగోలుకు ఖర్చు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. సాంకేతిక విద్యలో అవసరాలకు ఖర్చు..అదే విధంగా నివాస ప్రాంతం నుంచి దూరంగా ఉండే పాఠశాలలకు వెళ్లేం దుకు సైకిళ్ల కొనుగోలుకు అనుమతిస్తారు. కాగా, రుణం మొత్తాన్ని ఎందుకోసం వినియోగించామో సంబంధిత రశీదును స్త్రీనిధి అధికారులకు అందించాలి. రుణ మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా కనిష్ఠంగా 24 నెలల నుంచి 36 నెలల వరకు చెల్లించే వెసులుబాటు కల్పిస్తారు. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.












Click it and Unblock the Notifications