పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులు: లైన్ క్లియర్,ఇలా చెక్ చేసుకోండి..!!
రైతులకు ఒకే సారి రెండు పథకాల నగదు జమ కానుంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు నిర్ణయించింది. ప్రతీ రైతుకు రూ 20 వేలు ఆర్దిక సాయం చేస్తామనే హామీ అమల్లో భాగంగా ఏడాది లో మూడు సార్లు పీఎం కిసాన్ తో పాటుగా నిధుల విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, తొలి విడత నిధుల జమకు ముందే అర్హుల జాబితా పైన తుది కసరత్తు జరుగుతోంది. పీఎం కిసాన్ నిధులు వచ్చే వారం విడుదల చేయనుండటంతో.. వాటితో పాటుగానే అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసేలా ప్రభుత్వం కార్యాచరణ ఖరారు చేస్తోంది.
రైతుల ఖాతాల్లో
పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్రం ప్రతీ ఏటా అర్హులైన రైతులకు ఏటా మూడు సార్లు రూ 2 వేలు చొప్పున రూ 6 వేలు అందిస్తోంది. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పీఎం కిసాన్ తో పాటుగా మూడు విడతలుగా రూ 14 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. తొలుత ఈ నెల 20వ తేదీన పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తే.. వాటితో పాటుగానే అన్నదాత సుఖీభవ నిధుల ను జమ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే, కేంద్రం వచ్చే వారం ఈ పథకం అమలు దిశగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో..ఏపీ ప్రభుత్వం ఆ సమయంలోనే ఏపీలోని రైతులకు అన్నదాత సఖీభవ నిధులను జమ చేయనుంది. కాగా.. ఈ పథకం కోసం అర్హుల జాబితాను ఏపీ వ్యవసాయ శాఖ ఇప్పటికే దాదాపు ఖరారు చేసింది.

అర్హుల జాబితా
అన్నదాతా సుఖీభవ పథకం ఎంపికలో ప్రభుత్వం అర్హుల ఖరారు పైన జిల్లాల నుంచి సమాచారం సేకరిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతా సుఖీభవ పథకానికి 45,64,005 మంది రైతులు అర్హత సాధించినట్లు తెలిసింది. వారిలో 44,30,149 మంది రైతుల ఇకెవైసి పూర్తి కాగా.. 1,20,148 మందికి సంబంధించి ఇకెవైసి పెండింగ్ ఉంది. చివరి సారిగా 2024 జనవరిలో 53.58 లక్షల మంది రైతుల ఖాతాలో సొమ్ము జమ చేసింది. దీంతో పోలిస్తే ప్రస్తుతం 7.94 లక్షల మందికి తగ్గినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యలు, రెవెన్యూ చిక్కులు ఎదురవడంతో లక్షలాది మంది రైతుల వివరాలు పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. గత వైసిపి ప్రభుత్వం లో చేపట్టిన భూ సమగ్ర సర్వే సందర్భంగా అనేక భూ సమస్యలు తలె త్తాయి. అవి ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండడంతో అన్నదాతా సుఖీభవకు దరఖాస్తు చేసేందు కు ఆటంకంగా మారింది.
ఇలా చెక్ చేసుకోవచ్చు
గత ప్రభుత్వం డి పట్టా, ఆర్ఒఎఫ్ఆర్ సాగుదారులకు రైతు భరోసా వర్తింప జేసినా, అన్నదాతా సుఖీభవకు వారిని ప్రభుత్వం అర్హులుగా గుర్తిస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక, అర్హుల జాబితాలను వ్యవసాయ శాఖ అధికారుల రైతు సేవా కేంద్రాల కు(ఆర్ఎస్కే) పంపించారు. దీంతో అర్హుల గుర్తింపు ఈజీ అయ్యింది. వివరాలు లేనివారు మాత్రమే బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. https://annadathasukhibhava.ap.gov.in/లోకి వెళ్లి రైతులు తమ స్టేటస్ చెక్ చేసుకొనే అవకాశం కల్పించారు. రైతులు తమ ఆధార్ నంబర్ నమోదు చేసి.. పక్కనే ఉండా కాప్చాను ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అర్హుల వివరాలు కనిపిస్తాయి. అదే సమయంలో ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో, లేదో కూడా తెలుస్తుంది. జాబితాలో పేరు లేకుంగే రైతు సేవా కేంద్రంలో సంప్రదించటం ద్వారా స్పష్టత రానుంది. దీంతో, వచ్చే వారం ఈ పథకం నిధులు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications