ఏపీ రైతులకు గుడ్న్యూస్, రూ.2 వేల కోట్ల బకాయి విడుదల, ఉద్యానపంటలకు గిట్టుబాటు ధర...
రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వివిధ పథకాల కోసం పెండింగ్ ఉన్న బకాయి విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. రూ.2 వేల కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు తెలియజేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి 8 వేల కోట్లలో.. ఇప్పటికే రూ.6 వేల కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. బకాయి చెల్లింపుల కోసం ఆర్థికశాఖకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.
ఉద్యాన పంటలకు గిట్టుధర కల్పించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి కన్నబాబు తెలిపారు. కొబ్బరి, అరటి, నీరి, టమాటో, ఉల్లి ఫుడ్ ప్రాసెసింగ్ పరిధిలోకి తీసుకురావాలని కూడా ఆదేశించారని చెప్పారు. ఒక్కో ఉద్యాన పంటను ఒక్కొ క్లస్టర్ కింద తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కోనసమీలో కొబ్బరి పార్క్ ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వెల్లడించారు. పులివెందులలో అరటి పోస్ట్ హర్వెస్టింగ్ టెక్నాలజీ ఏర్పాటు సాధ్యసాధ్యాలను పరిశీలించాని సీఎం జగన్ ఆదేశించారని వివరించారు.
మదనపల్లిలో టమాటోకు గిట్టుబాటు ధర కల్పించాలని సీఎం సూచించారని కన్నబాబు తెలిపారు. పట్టు పరిశ్రమలకు గిట్టుబాటు ధరల స్థిరీకరణ నిధి నుంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి కన్నబాబు వివరించారు. పులివెందులలో ఐటీ కార్గో ఏర్పాటు చేస్తామన్నారు. కొబ్బరిలో వస్తోన్న వైరస్ను నివారించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో సాగవుతోన్న పంటలను విదేశాలను ఉత్పత్తి చేయడంపై సమావేశంలో చర్చకొచ్చిందని వివరించారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు గ్రామ సచివాలయం నుంచి బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల నుంచి విత్తనాల సరఫరా చేస్తామని మంత్రి కన్నబాబు వివరించారు.