ఏపీలో ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్- డీఏల విడుదల..!
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం చంద్రబాబు ఇవాళ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో ఎప్పటి నుంచో బకాయి పడిన జీవోల్ని విడుదల చేసేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ అమరావతి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు ముగింపు తర్వాత ప్రభుత్వం (AP Govt) ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో గతంలో ఎప్పుడెప్పుడు బకాయి పడిన డీఏలు ఉన్నాయన్న వివరాలను సర్కార్ వెల్లడించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇప్పటికే పలు డీఏలు బకాయిలు ఉన్న నేపథ్యంలో వాటిలో రెండు డీఏ బకాయిల్ని విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఇవాళ జీవో జారీ చేసింది. వీటిని 2025 జనవరి 1 నుంచి 1.82% డీఏ చెల్లించేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే 2024 జులై 1 నుంచి 2.73% డీఏ చెల్లించేందుకు ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చింది. రెండు డీఏల విడుదలతో ఉద్యోగులు, పింఛనుదారులకు ఆర్థికంగా ఊరట లభించినట్లయింది.

రాష్ట్రంలో ఉద్యోగులకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని కూటమి సర్కార్ నిలబెట్టుకోవడం లేదని ఆరోపిస్తూ తాజాగా ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు మూడు దశల ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. ఇందులో తొలి దశ కార్యాచరణను పూర్తి కూడా చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించింది. స్వయంగా సీఎం చంద్రబాబు వారితో చర్చలు జరిపి ఈ రెండు డీఏ బకాయిలు ఇచ్చేందుకు అంగీకరించారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవాళ జీవోల విడుదలపై ఆర్ధిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.














Click it and Unblock the Notifications
