పల్నాడులో ఆ ఉద్యోగుల రైలుకు హాల్ట్ ఖరారు- ఆ రోజు నుంచే-టైమింగ్స్ ఇవే..!
పల్నాడు జిల్లా ప్రజలు, నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. లింగంపల్లి - విజయవాడ - లింగంపల్లి మధ్య నడిచే ఇంటర్సిటీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (Vijayawada-Lingampalli Intercity Express)కు పిడుగురాళ్ల స్టేషన్లో (Piduguralla) హాల్ట్ కు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 04 నుంచి ఈ రైలు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో ఆగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ప్రకటించింది.
లింగంపల్లి ➔ విజయవాడ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు నెం. 12796 లింగంపల్లిలో ఉదయం 04:40కి బయలుదేరి, 08:06 గంటలకు పిడుగురాళ్ల చేరుకోనుంది. అక్కడి నుంచి 08:07 గంటలకు బయలుదేరి ఉదయం 10:35 గంటలకు విజయవాడ చేరుకునుంది. అలాగే విజయవాడ ➔ లింగంపల్లి ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు నెం. 12795 విజయవాడలో సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి రాత్రి 7:08 గంటలకు పిడుగురాళ్ల చేరుకుంటుంది. అక్కడి నుంచి 7:09 గంటలకు బయలుచేరి.. లింగంపల్లికి రాత్రి 11:35కు చేరుకోనుంది.

లింగంపల్లి -విజయవాడ మధ్య నడిచే ఈ ఉద్యోగుల రైలుకు పిడుగురాళ్లలో హాల్ట్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్ధానిక ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు పలు విజ్ఞప్తులు చేశారు. దీంతో ఈ రైలుకు పిడుగురాళ్లలో స్టాప్ కేటాయించారు. దీని వల్ల విజయవాడ, హైదరాబాద్ వైపు వెళ్లే వందలాది మంది ఉద్యోగులకు, పై చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు, వ్యాపారస్తులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఎంపీ లావు తెలిపారు. ఇప్పటివరకు పిడుగురాళ్లలో స్టాప్ లేనందున ఇబ్బందులు పడిన పల్నాడు పరిసర ప్రాంతాల ప్రజలు ఇకపై ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తన విన్నపాన్ని మన్నించి పిడుగురాళ్లలో స్టాప్ కు అనుమతించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు, ఇతర రైల్వే అధికారులకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.














Click it and Unblock the Notifications