ఏపీలో జరిగిన హత్యలెన్ని - అధికారిక లెక్కలిలా..!!
వైసీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. రాష్ట్రంలో హత్య రాజకీయాల పైన ఢిల్లీలో నిరసనకు సిద్దమైంది. ఇప్పటికే గవర్నర్ కు ఫిర్యాదు చేసిన వైసీపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయం లోనూ నిరసన కొనసాగించింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత 31 హత్యలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో, ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో జరిగిన హత్యల గురించి అధికారిక లెక్కలను వెల్లడించింది.
రాజకీయ వివాదం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచి కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే అంశం పైన పార్లమెంట్ లోనూ ప్రస్తావిస్తామని ఆ పార్టీ నేత మిథున్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 31 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని...రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఢిల్లీ వేదికగా జరగిన హత్యలు..దాడుల వివరాలతో సహా ఫొటోలను ప్రదర్శిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

వైసీపీ నిరసనలు
వైసీపీ ఆరోపణల సమయంలో అధికార యంత్రాంగం రాష్ట్రంలో హత్యల గురించి ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఏపీలో 31 రాజకీయ హత్యలు జరిగాయన్న ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించింది. జూన్ 4 నుంచి జులై 22 వరకు రాష్ట్రంలో రాజకీయ కారణాలతో జరిగిన హత్యలు 4 అని కీలక విషయాలను వెల్లడించింది. అందులో అనంతపురం జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 1 ఘటన జరిగాయని వివరించింది. మృతి చెందినవారిలో ముగ్గురు టీడీపీకి చెందినవారని స్పష్టం చేసింది. ఒకరు వైసీపీకి చెందినవారని వివరించింది.
ప్రభుత్వ వాదన
ఇవి కాకుండా పాతకక్షలు, రాజకీయ విభేదాలతో ఆవేశపూరితంగా జరిగిన గొడవల్లో పల్నాడు జిల్లాలో 1, శ్రీ సత్యసాయి జిల్లాలో 1 హత్య జరిగినట్టు వెల్లడించింది. ఈ ఘటనలో మృతులు ఇద్దరూ వైసీపీకి చెందినవారని పేర్కొంది. అధికారికంగా ఈ లెక్కలను వెల్లడించటంతో ఇప్పుడు వైసీపీ ఏ రకంగా స్పందిస్తుందనేది చూడాలి. ఇప్పటికే ఇవే లెక్కలపైన హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ చెబుతున్న లెక్కల్లో వాస్తవం లేదన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఢిల్లీ చేరటంతో చోటు చేసుకొనే పరిణామాల పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications