అమరావతిపై ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామం..!!
ఏపీ కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధానంగా అమరావతి..పోలవరం పైన ఫోకస్ చేసింది. ఇప్పటికే చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుతో పాటుగా..అమరావతిని సందర్శించారు. ఈ రెండు తమకు ప్రాధాన్యత అంశాలుగా వెల్లడించారు. ఇదే సమయంలో అమరావతి నిర్మాణానికి ఖర్చు పైన అంచనాకు వచ్చారు. ఈ రెండు అంశాలకు కేంద్రం మద్దతు అవసరమని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో, ఢిల్లీలో కేంద్రానికి ఏపీ ప్రభుత్వం తాజా అభ్యర్దన చేసింది.
కేంద్రానికి అభ్యర్దనలు
కేంద్రం నిర్వహించిన ప్రీ బడ్జెట్, జిఎస్టి 53వ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ఆర్దిక మంత్రి పయ్యావుల పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్రానికి అందాల్సిన సాయంపై కేంద్రానికి నివేదిక అందజేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల వచ్చిన ఆర్థిక సవాళ్ళను అధిగమించడానికి, గత ప్రభుత్వ హాయంలో గడిచిన ఐదేళ్లలో ఆర్థిక పరమైన తప్పులను సరిదిద్దాడానికి కేంద్రం సహకారం కావాలని కోరామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు సహకారం కోరారు.

అమరావతికి ఆర్దిక సాయం
రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి రూ 15 వేల కోట్లు ఇవ్వాలని అభ్యర్దించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఉదారంగా ఆర్థిక సాయం అందించాల్సిందిగా కోరామని కేశవ్ చెప్పారు. తిరుపతి, వైజాగ్ ఎయిర్ పోర్ట్లకు రావాల్సిన రీయంబర్స్ మెంట్ ఇవ్వాలని కోరానని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరినట్లు తెలిపారు. రైల్వే జోన్ ఆపరేషన్ కు సహకారం ఇవ్వాలన్నారు. గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు సహకారం అందించాలని కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు. చేనేత వస్త్రాలపై 5 శాతం పన్ను మినహాయింపు కోరామని అన్నారు.
రాష్ట్రానికి మద్దతు ఇవ్వండి
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయడానికి సమయం పడుతుందని తెలిపారు. తిరుపతి, వైజాగ్ ఎయిరుపోర్టుల కోసం స్వాధీనం చేసుకున్న భూములకు సంబంధించిన రీయింబర్స్మెంటు నిధులను విడుదల చేయాలని అడిగామన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరామని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం చేయూత అత్యవసరమనే విషయాన్ని వివరించామని తెలిపారు. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటు, క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రోలియం కాంప్లెక్స్, రైల్వే జోన్కు సహకారం అందించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications