జిల్లాల పేర్లలో తాజా మార్పులు - "కడప" ఇక నుంచి: ఆ జిల్లాల్లోనూ సవరణలు ఇలా..!!
ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు పైన జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసింది. కొత్త జిల్లాల పేర్లు ఖరారు చేసింది. కొన్ని ప్రాంతాల్లో నియోజకవర్గాల ను కలపటం.. కొన్ని జిల్లాల్లో పక్కనే ఉన్న జిల్లాకు మార్పు వంటివి చేసారు. ఇక, కొత్త పేర్ల పైన అక్కడక్కడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేసన్లలో చేసిన ప్రతిపాదనల పైన ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం కానుంది. ఈ ప్రతిపాదనలపైన ఎవరికైనా అభ్యంతరాలు... సూచనలు ఉంటే 30 రోజుల్లో జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్లలో స్పష్టం చేసింది.

నోటిఫికేషన్ల జారీ ముందు స్వల్ప మార్పులు
అయితే, ఆన్ లైన్ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు..నోటిఫికేషన్ల జారీ సమయానికి కొన్నింట మార్పులు జరిగాయి. తొలుత రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు చేయాలని భావించిన జిల్లాకు అదే పేరుతో రాజమహేంద్ర వరం జిల్లాగా పేరు ఖరారు చేస్తూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా.. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంతో ఏర్పాటు చేసిన జిల్లాకు పశ్చిమ గోదావరి.. భీమవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు నరసాపురం జిల్లా అని పేరు నిర్ణయించారు. కానీ, గెజిట్ నోటిఫికేషన్లలో మాత్రం వీటిల్లో మార్పులు జరిగాయి. కాకినాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు కాకినాడగా.. రాజమహేంద్ర వరంగా కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు తూర్పు గోదావరి పేరు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ అయింది.

గోదావరి జిల్లాలపై ప్రత్యేకంగా
ఏలూరు కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు ఏలూరు జిల్లా అని, భీమవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు పశ్చిమగోదావరి అని పేరు పెట్టినట్లుగా తెలిపారు. మంగళవారం రాత్రి కేబినెట్ సమావేశం ముగిశాక, ఈ మార్పులు చేసినట్లు తెలిసింది. రాజమహేంద్రవరం, భీమవరం కేంద్రాలుగా ఏర్పాటయ్యే జిల్లాల్లో ఎక్కువ భాగం గోదావరి నదిని ఆనుకుని ఉన్నందున... వాటికి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలని పేర్లు పెట్టాలని కొందరు మంత్రులు చేసిన సూచన మేరకు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇక, ప్రకాశం జిల్లాలో రెవిన్యూ డివిజన్ విషయంలోనూ తొలుత చేసిన ప్రతిపాదన.. నోటిఫికేషన్ సమయంలో మారి పోయింది.

ప్రకాశం..నెల్లూరులో మార్పులు
కొత్తగా కనిగిరి రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేస్తున్నట్లు కేబినెట్ మెమోరాండంలో పేర్కొనగా, గెజిట్ నోటిఫికేషన్లో కనిగిరి పేరు తీసేశారు. కొత్తగా పొదిలి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటయ్యే శ్రీసత్యసాయి జిల్లాలో పెనుగొండ, పుట్టపర్తి, కదిరి రెవెన్యూ డివిజన్లు ఉంటాయని పేర్కొనగా, గెజిట్ నోటిఫికేషన్లో మాత్రం పెనుగొండ, పుట్టపర్తితోపాటు ధర్మవరం రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రకటన చేసారు. అదే విధంగా నెల్లూరు జిల్లాను పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాగా ఉండగా... దానిని ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా అని తొలుత ప్రతిపాదించారు. కానీ, అధికారిక నోటిఫికేషన్ లో తిరిగి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.

సీఎం జగన్ సొంత జిల్లా ఇక..
అదే విధంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప విషయంలోనూ మార్పు జరిగింది. తొలుత కేబినెట్ ప్రతిపాదనలో వైఎస్ఆర్ కడప అని తొలుత పేర్కొనగా దానిని ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాగా సవరించారు. కడప జిల్లా పేరు ఇక నుంచి పూర్తిగా వైఎస్సాఆర్ పేరుతోనే కొనసాగనుంది. మరి కొన్ని మండలాల విషయంలోనూ స్థానిక డిమాండ్ల మేరకు స్వల్ప మార్పులు చేస్తూ నోటిఫికేషన్లు జారీ చేసారు. దీని పైన ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ ..అభిప్రాయాలు.. సూచనలు పరిగణలోకి తీసుకొని అవసరమైన మార్పులు - చేర్పులతో ఉగాది నాటికి కొత్త జిల్లాల్లో పాలన సాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications