ఏపీలో పాఠశాలల పని వేళల పెంపు - కొత్త టైం టేబుల్..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల పని వేళలు పెంచేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పాఠశాలల పని వేళల్లో మార్పులు చేస్తూ కొత్త టైం టేబుల్ సిద్దం చేసారు. ముందుగా నెల్లూరు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి.. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న సమయానికి అదనంగా మరో గంట పెంచేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ తాజా నిర్ణయం పైన ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పని వేళల్లో మార్పులు
ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం అమలు దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పని వేళల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పని చేస్తున్న సమయాన్ని మరో గంట పొడిగించేందుకు సిద్దమైంది. ప్రస్తుతం ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి 4 గంటల వరకు నడుస్తున్నాయి. దీనిని ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమలు చేయనుంది. ముందుగా నెల్లూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేసి.. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. కొత్త టైం టేబుల్ ను నెల్లూరు జిల్లాలో అమల్లో భాగంగా ఒక మండలంలోని ఉన్నత పాఠశాల లేదా హైస్కూల్ ప్లస్ లో అమలు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి.

కొత్త టైం టేబుల్
అందులో భాగంగా ఈ నెల 25 నుంచి 30వ తేది వరకు ఈ టైం టేబుల్ను అమలు చేసి ఫీడ్ బ్యాక్ నివేదిక రూపంలో అందించాలని స్పష్టం చేసారు. కొత్త టైం టేబుల్ అమల్లో భాగంగా సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలల వేళలు పొడించనున్నారు. అదే విధంగా.. ఉదయం, మధ్యాహ్నం ఇచ్చే బ్రేక్ల సమయం 5 నిమిషాల చొప్పున, భోజన విరామం 15 నిమిషాలు పెంచుతూ ప్రతిపాదనలు సిద్దం చేసారు. ఇక నుంచి ఉదయం మొదటి పీరియడ్ 5 నిమిషాలు పెంచి 50 నిమిషాలు చేస్తూ నిర్ణయించారు. ఆ తర్వాత 3 పీరియడ్లు ప్రస్తుతం 40 నిమిషాల చొప్పున ఉండగా వాటిని 45 నిమిషాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు
మధ్యాహ్నం మొదటి పీరియడ్ను మార్చకుండా అనంతరం 3 పీరియడ్లు 45 నిమిషాలకు పెంచుతూ అధికారులు మార్పులు చేసారు. విద్య శాఖ తాజా మార్పుల కారణంగా రోజులో ఇక నుంచి పాఠశాలల పని సమయం గంట మేర పెరుగనుంది. పాఠశాల విద్యాశాఖ నిర్ణయంపై ఉపాధ్యాయుల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కొంతమంది స్వాగతిస్తుండగా, మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఈ నిర్ణయం ముందుగా నెల్లూరులో అమలు చేస్తుండగా.. ఇక్కడ అమలులో ఎదురైన సమస్యలు..వచ్చిన ఫీడ్ బ్యాక్ .. ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు ఏపీ విద్యా శాఖ తాజా ప్రతిపాదన విద్యార్ధుల తల్లిదండ్రుల్లో చర్చగా మారుతోంది.












Click it and Unblock the Notifications