ఏపీ స్ధానిక పోరు తేలకపోతే.. బడ్జెట్ సమావేశాలు ముందుకు ? ప్రభుత్వం సమాలోచనలు..
ఏపీలో స్ధానిక ఎన్నికల పర్వం వాయిదా పడటం అన్ని సమీకరణాలను మార్చేస్తోంది. ముఖ్యంగా స్ధానిక ఎన్నికల పోరు వాయిదా పడటం వల్ల ఈ నెలాఖరులోగా నిర్వహించ తలపెట్టిన అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలపైనా తకరారు నెలకొంది. అయితే స్ధానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా షెడ్యూల్ మార్పుతో పాటు అసెంబ్లీ సమావేశాల తేదీలు కూడా ఖరారు కానున్నాయి.

స్ధానిక పోరు వాయిదా-సమీకరణాలు
ఏపీలో స్ధానిక ఎన్నికలు వాయిదా పడటం పలు సమీకరణాల మార్పుకు కారణమవుతోంది. కరోనా వైరస్ ప్రభావం చూపుతోందన్న కారణంతో ఎన్నికల కమిషనర్ ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా వేయడంతో ఇప్పుడు ప్రభుత్వం దాన్ని సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టులోనూ సవాలు చేసింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలను అసాధారణంగా వాయిదా వేశారని ఆరోపిస్తున్న వైసీపీ సర్కారు దీనిపై న్యాయపోరాటానికి సమాయత్తమైంది.

కోర్టు తీర్పు ఆధారంగానే అన్నీ...
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టులోనూ సవాలు చేసిన ప్రభుత్వం, ఇందులో వచ్చే తీర్పు ఆధారంగానే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పుతో స్దానిక ఎన్నికల తేదీలు ఖరారవుతాయి. అప్పుడు వాటి ఆధారంగా అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయే యోచనలో ఉంది. వాస్తవానికి స్ధానిక ఎన్నికల పోరు ఈ నెల 28 కంటే ముందే ముగుస్తున్నందున నెలాఖరులో అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ సమావేశాలు నిర్వహిస్తే బావుంటుందని భావించింది. కానీ స్ధానిక పోరు వాయిదాతో ఈ లెక్క తప్పింది.

కోర్టు తీర్పు సానుకూలంగా వస్తే...
స్ధానిక ఎన్నికల తేదీలను సుప్రీంకోర్టు ఆరువారాల కంటే ముందుగానే నిర్ణయించే నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు కూడా ముందుకు జరిగే అవకాశముంది. అలా కాకుండా ఈ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించేలా కోర్టు తీర్పు ఇస్తే అప్పుడు హడావిడిగా నెలాఖరులోగా రెండు, మూడు రోజుల పాటు అసెంబ్లీని తూతూమంత్రంగా ముగించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికల ప్రక్రియను యథాతథంగా కొనసాగించేలా సుప్రీంకోర్టును కోరడం, కుదరదని తేలితే అసెంబ్లీ సమావేశాలను ముందుకు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఎలాగైనా ఓటాన్ అకౌంటే...
స్ధానిక ఎన్నికల పోరు వాయిదాను సుప్రీంకోర్టు ఆమోదించే పక్షంలో అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముందుకు జరపాలని వైసీపీ సర్కారు భావిస్తోంది. అయితే అలా జరపాల్సి వచ్చినా ఓటాన్ అకౌంట్ మాత్రమే సాధ్యమవుతుంది. వాస్తవానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించాలంటే అందుకు 14 రోజుల పాటు అసెంబ్లీలో చర్చ అవసరమని నిబంధనలు చెబుతున్నాయి. కాబట్టి అంత సమయం లేనందున కోర్టు తీర్పు ఎలా ఉన్నా బడ్జెట్ మాత్రం పరిమితంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications