తల్లికి వందనం, రైతు భరోసా నిధుల జమ ముహూర్తం ఖరారు..!!
ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీ అమలు దిశగా కసరత్తు చేస్తోంది. సూపర్ సిక్స్ పథకాల్లో ముందుగా రెండు స్కీంలను అమలు చేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టంది. వచ్చే నెలలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ద్వారా మిగిలిని ఆర్దిక సంవత్సరం బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. అదే విధంగా అమ్మకు వందనం. అన్నదాత సుఖీభవ పథకాలకు నిధుల జమకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.
తల్లికి వందనం అమలు
ఏపీ ప్రభుత్వం మహిళలకు, రైతులకు ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలు పూర్తయింది. సూపర్ సిక్స్ హామీల అమలు పైన ప్రతిపక్షాల నుంచి విమర్శలు పెరిగాయి. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి కారణంగా వచ్చే ఆర్దిక సంవత్సరం నుంచి పథకాల అమలు చేయాలని తొలుత ప్రభుత్వం భావించింది. అయితే, జమిలి ఎన్నికల ప్రచారం.. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో అంత కంటే ముందుగానే రెండు కీలక పథకాల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది దాదాపు 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ 'తల్లికి వందనం' అమలు చేసేందుకు దాదాపు 12వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి సంబంధించి నిధుల సమీకరణ పైన అధికార యంత్రాంగం ఫోకస్ చేసింది.

అన్నదాత సుఖీభవ
అదే విధంగా తాము అధికారంలోకి వస్తే ప్రతీ రైతుకు ఏటా రూ 20 వేలు చొప్పున ఆర్దిక సాయం చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. గతంలో రతు భరోసా పేరుతో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకానికి 'అన్నదాతా సుఖీభవ' గా పేరు మార్చారు. అయితే, ఈ పథకం కింద వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రైతులకు సహాయం అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పథకం అమలుకు విధివిధానాల రూపకల్పనకు కసరత్తు చేస్తోంది. నిజమైన సాగుదారులను పరిగణనలోకి తీసుకుని, అటు భూ యజమానులకు, ఇటు కౌలు రైతులకు ప్రయోజనం కలిగేలా పథకం అమలు చేస్తామని చెబుతున్నారు. కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6వేలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేలు కలిపి, మొత్తంగా ఏటా రూ.20వేలు ఇవ్వనున్నారు.
ప్రభుత్వం కసరత్తు
ఆర్దికంగా ఉన్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం పథకాల అమలుకు కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఆ బడ్జెట్ లోనే సంక్షేమ పథకాల అమలు కోసం రూ 20 వేల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. తల్లికి వందనం ఈ ఆర్దిక సంవత్సరంలోనే అమలు చేసి..మిగిలిన పథకాలు వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ దీపావళి నుంచి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇప్పటికే రూ 4 వేల పెన్షన్ అమలు అవుతోంది. దీంతో.. ఈ రెండు పథకాల అమలు పైన ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications