అమరావతి రైతుల అనూహ్య నిర్ణయం - చంద్రబాబు వాట్ నెక్స్ట్..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతి నిర్మాణాలకు వీలుగా కసరత్తు ప్రారంభించారు. కేంద్రంతో ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం సహకారం అందించాలని కోరారు. గత అయిదేళ్ల కాలంలో అమరావతి పైన కోర్టుల్లో పలు కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రైతులు కోర్టుకెళ్లారు. ఇప్పుడు రైతులు ఈ కేసుల విషయంలో కీలక నిర్ణయాలకు సిద్దమయ్యారు. దీంతో, ప్రభుత్వం రైతుల కేసుల విత్ డ్రా పైన కసరత్తు చేస్తోంది.
అమరావతి కేసులపై
అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వ తీరు పై రైతులు కోర్టుల్లో కేసులు దాఖలు చేసారు. వేర్వేరు కోర్టుల్లో 100కుపైగా కేసులు ఉన్నప్పటికీ ప్రధానంగా సుప్రీం కోర్టులో ఆరు కేసులు, హైకోర్టులో ఒకటి ఉన్నాయి. ఇవిగాకుండా రైతులు వ్యక్తిగతంగా 100కుపైగా కేసులు దాఖలు చేశారు. ప్రభుత్వం మారడంతో పాటు, నూతన ప్రభుత్వం అమరావతికి అనుకూల వైఖరి తీసుకోవడంతో కేసులను ఏం చేద్దామనే చర్చ రైతుల్లో జరుగుతోంది. రాజధానిలో పనులకు ఈ కేసులే అడ్డంకిగా మారడంతో వాటిని ఉపసంహరించుకోవాలని రైతులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనికి చట్టపరమైన ప్రక్రియ అవసరం ఉండటంతో ఆ మేరకు కసరత్తు చేస్తున్నారు.

కేసులు క్లియర్ అయితే
ప్లానుకు విరుద్ధంగా ఆర్-5 జోన్ ఏర్పాటు చేయడంపై రైతులు కోర్టును ఆశ్రయించారు. కొత్త ప్రభుత్వం పాత ప్రణాళికల ప్రకారమే రాజధాని నిర్మాణం ఉంటుందని చెప్పటంతో ఆర్5 జోన్ అడ్డుతొలిగినట్టేనని రైతులు భావిస్తున్నారు. ఈ మేరకు పెట్టిన కేసులను వెనక్కి తీసుకున్నటు కోర్టులో పిటిషన్లు దాఖలు చేయాల్సిఉంది. అలా దాఖలు చేసిన తరువాత 90 రోజుల్లోపు ఎప్పుడైనా కేసులను కొట్టివేసే అవకాశం ఉంది.ఇవి కాకుండా మూడు రాజధానుల అంశంపైనా సుప్రీం కోర్టులో కేసు ఉంది. ముఖ్యంగా రాజధాని పరిధి మొత్తాన్ని ఒక కార్పొరేషన్గా మారుస్తూ టిడిపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 217 చదరపు కిలోమీటర్లతోపాటు చుట్టుపక్కల గ్రామాలను అందులో కలపాలని నిర్ణయించింది.
రైతుల పై కేసులు ఎత్తివేత
వైసిపి ప్రభుత్వం మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని గ్రామాలను మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి అందులో కలిపేసింది. దీనివల్ల రాజధాని ప్లానుకు విఘాతం కలగుతుందని రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించి మరో పిటీషన్ దాఖలు చేశారు. పూలింగులు రైతుల నుండి తీసుకున్న భూములకు రిటర్నబుల్ ప్లాట్లు తిరిగి ఇస్తానన్న సమయానికి ఇవ్వలేదని,వెంటనే ఇప్పించడంతోపాటు ఆలస్యానికి కొంత నష్టపరిహారం ఇప్పించాలని పిటీషన్ దాఖలైంది. వీటిల్లో ఆర్5 జోన్ ఏర్పాటు తప్ప మిగిలిన కేసులన్నీ సుప్రీం కోర్టులో ఉన్నాయి. వీటిన్నంటిని వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక..రైతుల మీద గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులను సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ఉండటంతో వాటికి అనుగుణంగా ఈ వ్యవహారం చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications