ఎపి:16,447 కోట్లు రావాలి...కాదు 12 వేల కోట్లే:కేంద్రం...తేలని లెక్కలు
అమరావతి:ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రత్యేక ప్యాకేజీ అంశంపై మరోసారి చిచ్చు రగులుతోంది. ప్రత్యేక హోదాతో సమానంగా అన్నీచేస్తామన్న కేంద్రం నుంచి ఆ ప్యాకేజీలో ఎపికి రావలసింది రూ.16,447 కోట్లు అని రాష్ట్ర ప్రభుత్వం లెక్క చెబుతుండగా...కేంద్రం మాత్రం 12 వేల కోట్లే నని తేల్చేయడంపై మళ్లీ సమస్యాత్మకంగా మారుతోంది.
Recommended Video
పార్లమెంటు సమావేశాలు ముగిసి నాలుగు రోజులు అవుతున్నావిభజన హామీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లెక్కలు తేలడం లేదు. ఎపికి స్ఫెషల్ ప్యాకేజీ, రెవిన్యూ లోటు భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 2014-15 నాటి ఎపి రెవిన్యూలోటు విషయం తేలకపోవడం...ప్రత్యేక ప్యాకేజీ కింద ఎపికి ఎంత ఇవ్వాల్సిఉందనే విషయంపై భిన్నమైన అభిప్రాయం కలిగి ఉండటంతో కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మధ్య జరగాల్సిన సమావేశం వాయిదా పడింది.
మొత్తంగా చూస్తే...లెక్కల్లో తేడానే...
ప్రత్యేక ప్యాకేజీ కింద తమకు అయిదేళ్లకు రూ.16,447 కోట్లు రావాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేస్తుండగా...కేంద్రం మాత్రం ఎపికి ఇవ్వాల్సింది గరిష్టంగా 12వేల కోట్లేనని తేల్చేస్తోంది. ఏపీ మాత్రం తాము లెక్క పక్కాగానే వేశామని...పైగా 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చాక సీఎస్ఎస్ కింద రాష్ట్రానికి గత మూడేళ్లలో కేంద్రం ఎంత ఇచ్చిందో స్పష్టంగా ఉందని అంటోంది. ఆ మొత్తానికి 30శాతం కలిపితే తమకు రావాల్సిన మొత్తం ఎంతో తెలుస్తుందని వివరిస్తోంది.
లెక్కలు తేలకే...ఎపి అధికారుల...ఢిల్లీ పర్యటన వాయిదా
ఎపికి నిధుల మంజూరు విషయంలో జైట్లీ పార్లమెంట్ ప్రకటన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖల అధికారులు రెండు రోజులపాటు సమీక్షించారు. అయితే ఈ సమావేశాల్లోనూ ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉండటంతో సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చంద్రంగా నిలిచిపోయింది. అసలైన లెక్క తేలకుండా వట్టిగా సమావేశాలు నిర్వహించి ప్రయోజన లేదనే విషయాన్ని గుర్తించడంతో సోమవారం జరగాల్సిన ఇరువర్గాల సమావేశాలు వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు సోమవారం ఢిల్లీకి రావాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ఆర్థికశాఖ అధికారుల సూచన మేరకు వారి పర్యటన బుధవారానికి వాయిదా పడింది.
కాబట్టి...ప్రధాని మోడీనే...ఏదో ఒకటి తేల్చేయాలి
కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించి కీలక తరుణంలో ఈ విధంగా ప్రత్యేక ప్యాకేజీ లెక్కల విషయంలో తేడాలు రావడంతో సమస్య పరిష్కారం మార్గం కనిపించడం లేదు...అసలు ఇవ్వాల్సింది ఎంత అనే విషయంపై లెక్కలు తేలకుండానే ఎపికి సాయం చేసేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం తేలిగ్గా చెబుతుండటం, మరోవైపు ఇప్పటికే ఎపికి ఇచ్చిన నిధులపైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉండటంతో తాజా వ్యవహారంపైనా కేంద్రం వైఖరిపై రాష్ట్ర ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంలో ప్రధాని మోడీ చొరవ తీసుకొని దిశానిర్ధేశం చేస్తేనే నిధుల మంజూరు విషయంలో ముందుకు వెళ్లడానికి సాధ్యపడుతుంది. లేనిపక్షంలో కాలయాపన జరిగి ఈ సమస్య అటు ఎపికి...ఇటు కేంద్రానికి సంక్లిష్టంగా మారుతుంది.
10 వేల కోట్లకు ఎపి డిమాండ్...అమ్మో అంటున్న కేంద్రం...
ఎపికి ఈఏపీలు, ప్రత్యేక ప్యాకేజీ, రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల కోట్ల గ్రాంట్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అయితే ఎపి అడుగుతోంది చాలా పెద్ద మొత్తమని, అంత తాము ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఈ సమయం అత్యంత కీలకమని గుర్తెరిగి కూడా ఎపికి ఆర్థిక సాయం విషయంలో మూరెడు ముందుకు...బారెడు వెనక్కు అన్న చందంగా సాగుతున్న వ్యవహార శైలితో ఈ రెండు చోట్ల అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.