జగన్ సర్కార్కు భారీ షాక్-ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దు- హైకోర్టు సంచలనం
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు విషయంలో హైకోర్టులో జరుగుతున్న విచారణ కీలక ముగింపుకు దారి తీసింది. రాష్టంలో పరిషత్ ఎన్నికల నిర్వహణలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విపక్షాలు హైకోర్టులో కేసు దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ పూర్తిగా ఎన్నికలనే రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించలేదనే కారణంతో ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
పరిషత్ ఓట్ల లెక్కింపుపై హైకోర్టు విచారణ
ఏపీలో ఆది నుంచీ వివాదాలతో సాగిన పరిషత్ ఎన్నికల నిర్వహణ కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే ఏప్రిల్ మొదటివారంలో నిర్వహించిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడగా.. ఇవాళ ఎన్నికల విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అదికార వైసీపీకి అనుకూలంగా సాగాయని విపక్షాలు విమర్శించిన ఈ ఎన్నికలపై హైకోర్టు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. దీంతో ప్రభుత్వానికి ఇదో భారీ ఎదురుదెబ్బ కానుంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దు
ఏపీలో గత నెల రెండో వారంలో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు ఇవాళ సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఎన్నికలు జరగలేదని విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు రద్దు చేయడంతో పాటు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది.
జగన్ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ
ఏపీలో గతేడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత భారీగా ఏకగ్రీవాలు చోటు చేసుకున్నాయి. దీంతో అధికార వైసీపీపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కూడా ఈ ఏకగ్రీవాలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. చివరకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేక, అలాగని పాత నోటిఫికేషన్ కొనసాగించలేక నిమ్మగడ్డ తన పదవీకాలంలో ఈ ఎన్నికలు నిర్వహించకుండానే పదవీ విరమణ చేసారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం నియమించిన ఎస్ఈసీ నీలం సాహ్నీ జాయిన్ అయిన తొలిరోజే నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ 8న ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికల్ని హైకోర్టు రద్దు చేయడంతో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
హైకోర్టు తీర్పు వెనుక కారణాలివే
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం తీవ్ర సంచలనం రేపుతోంది. అయితే దీని వెనుక కొన్ని ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. వీటిలో నాలుగు వారాల ఎన్నికల కోడ్ నిబంధన ఉల్లంఘించడం, అలాగే నోటిఫికేషన్కూ, ఎన్నికలకూ మధ్య సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం గ్యాప్ లేకపోవడం ప్రధానంగా మారాయి. వీటిపైనే విపక్ష పార్టీలు కూడా ప్రధానంగా అభ్యంతరం తెలిపాయి. దీంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేని పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.