సమ్మె నోటీసు ఇచ్చేవారు కోర్టు ముందుకు రావాలి- పీఆర్సీని సవాల్ చేయలేరు : హైకోర్టు కీలక ఆదేశాలు..!!
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె నోటీసుకు ఇచ్చేందుకు సిద్దం అవతున్న వేళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీఆర్సీపై ఏపీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గాయా.. పెరిగాయా.. చెప్పండని పిటిషన్ దారులను హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి సమాచారం లేకుండా పిటిషన్ ఎలా వేస్తారని, అయినా పీఆర్సీని సవాల్ చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసింది. పీఆర్సీ నివేదిక బయటకు రాకుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది.
Recommended Video
పీఆర్సీ పర్సంటేజ్ అధికారం ప్రభుత్వానిదే
విభజన చట్టం ప్రకారం పీఆర్సీ ఇవ్వలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విభజన చట్టం ప్రకారం హెచ్ఆర్ఏ ఇవ్వలేదని అన్నారు. ఇక ఏపీ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. పీఆర్సీపై ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఎలా బెదిస్తారని వాదించారు. సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని బెదిరించడమే కాకుండా కోర్టులో రిట్ పిటిషన్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. సమ్మె నోటీసు ఇవ్వనున్న 12 మంది ఉద్యోగ సంఘాల నేతలు తమ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ గజిటెడ్ అధికారుల సంఘం ఈ పిటీషన్ దాఖలు చేసింది.
ఉద్యోగ సంఘాల నేతలు హాజరు కావాలి
పీఆర్సీ పబ్లిక్ డొమైన్ లో ఉంచలేదని కోర్టుకు నివేదించింది. విభజన చట్టం ప్రకారం హెచ్ఆర్ఏ ఇవ్వటం లేదని వివరించింది. నోటీసులు లేకుండా జీతాల్లో కోత విధించటం సరి కాదని కోర్టుకు నివేదించింది. దీనికి ప్రభుత్వం నుంచి వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం జీతాలు పెరిగాయంటూ గణాంకాలత సహా వివరించారు. ఉద్యోగుల గ్రాస్ జీతాలు పెరిగాయని స్పష్టం చేసారు. సమ్మె నోటీసు ఇస్తూనే కోర్టును ఆశ్రయించారని వివరించారు. దీంతో..కోర్టు జీతం పెరిగిందా లేదా అంటూ పిటీషనర్లను ప్రశ్నించింది. జీతాలు..పీఆర్సీ శాతాన్ని తగ్గించే అధికారం ప్రభుత్వానికి ఉందని తేల్చి చెప్పింది.
ప్రభుత్వం - ఉద్యోగుల మధ్య అంతరం పెరగకూడదు
పర్సంటేజ్ ను ఛాలెంజ్ చేసే హక్కు లేదని స్పష్టత ఇచ్చింది. పీఆర్సీ పైన సమ్మెకు వెళ్తామని ఎలా బెదిరిస్తారని నిలదీసింది. దీని పైన రిట్ పిటీషన్ ఎలా వేస్తారంటూ ప్రశ్నించింది. ఈ పిటీషన్ లో లీగల్ శాంటిటీ లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఉద్యోగులు - ప్రభుత్వం మధ్య సమస్య జటిలం కాకూడదని వ్యాఖ్యానించింది. మధ్నాహ్నానికి ఈ కేసును వాయిదా వేసింది. దీంతో.. ఉద్యోగ సంఘాల సమ్మె నిర్ణయం..నోటీసు ఇవ్వాలని డిసైడ్ అయిన సమయంలో కోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. మధ్నాహ్నం కోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.