ఏపీలో 2019 ఓటర్ల జాబితాతోనే పంచాయతీ పోరు- రెండు పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
ఏపీలో పంచాయతీ ఎన్నికలను 2019 ఓటర్ల జాబితాతో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ దాఖలైన రెండు పిటిషన్లను విచారించిన హైకోర్టు వాటిని కొట్టేసింది. 2019 ఓటర్ల జాబితాతో ఈ ఎన్నికలు నిర్వహించడం వల్ల 3.6 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోతున్నట్లు పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. అయితే పిటిషనర్ల వాదనపై ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది.
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ప్రయత్నాలకు గతంలో వైసీపీ సర్కారు అడుగడుగునా అడ్డు తగిలింది. ప్రభుత్వ వైఖరితో పంచాయతీ రాజ్శాఖ అధికారులు ఎస్ఈసీ కోరినా 2021 ఓటర్ల జాబితాను అందించలేదు. దీంతో విధిలేని పరిస్ధితుల్లోనే 2019 ఓటర్ల జాబితతాతో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇప్పటికే తెలిపారు. ఇందుకు బాధ్యులైన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు.

2019 ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించడం వల్ల భారీగా యువతీయువకులు ఓటుహక్కు కోల్పోతున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. ఎన్నికలను వాయిదా వేసి కొత్త జాబితా వచ్చాకే నిర్వహించాలని హైకోర్టును కోరారు. అయితే ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం, తిరిగి వాయిదా వేసే పరిస్ధితి లేకపోవడంతో ఈ సమయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది.












Click it and Unblock the Notifications