వైసీపీ నేతల అరెస్ట్ తప్పదా?
AP High Court: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం వాళ్లు దాఖలు చేసుకున్న పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఇంటి మీద దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నందిగం సురేష్, దేవినేని అవినాష్ సహా ఇతర నాయకుల పిటిషన్లను తిరస్కరించింది.
పిటీషన్లపై విచారణను తిరస్కరించిన నేపథ్యంలో ఆయా నాయకులపై రెండు వారాల వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అలాగే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది హైకోర్టు.

మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో రూరల్ పోలీసులు గతంలో ఆయా నాయకులందరిపైనా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వాళ్లందరూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు- వారి విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులను ఇదివరకే ఇచ్చింది.
పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్లు వేసిన వారిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రాఘురాం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఉన్నారు.
ఉండవల్లిలో గల చంద్రబాబు నివాసంపై దాడి వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ప్రత్యేకంగా మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు ఇదివరకే తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పును వినిపించింది. ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications