కాగల కార్యం హైకోర్టే తీర్చిందా ? మరోసారి గట్టెక్కిన జగన్ -కిక్కురుమనని విపక్షాలు
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల్ని విపక్షంలో ఉన్న టీడీపీ, బీజేపీ వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. అయితే సున్నితమైన విషయాల్లోనూ రాజకీయాల్ని వెత్కుకునేందుకు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. రాజకీయంగా మైలేజ్ సాధించే క్రమంలో విపక్షాలు ఆడుతున్న ఈ క్రీడకు ప్రతిసారీ బ్రేకులు పడుతూనే ఉన్నాయి. అయినా విపక్షాలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గుతున్న సూచనలు కనిపించడం లేదు. తాజాగా మరోసారి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఏపీలో విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
వైసీపీ వర్సెస్ టీడీపీ, బీజేపీ
ఏపీలో అధికార వైసీపీని టార్గెట్ గా చేసుకుని గత రెండేళ్లుగా బీజేపీ, టీడీపీ వంటి విపక్షాలు పలు ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ పనితీరు, విధానాలపై ఈ ఆరోపణలు, విమర్శలు ఉంటే తప్పులేదు. కానీ దురదృష్టవశాత్తూ కేవలం రాజకీయంగా మైలేజ్ కోసమే చేస్తున్న విమర్శలతో నిత్యం ప్రభుత్వంపై పోరు సలుపుతున్నట్లు విపక్షాలు చేసుకుంటున్న ప్రచారానికి తగిన ఆదరణ లభించడం లేదు. తాజాగా మరో విషయంలోనూ ఇది రుజువైంది. వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ వాస్తవ విరుద్ధంగా ఈ రెండు పార్టీలు సాగించిన పోరు విఫలం కావడంతో ప్రజల్లో పలుచన కావడమే మిగిలింది.
గణేశ్ ఉత్సవాలపై రగడ
ఏపీలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. కోవిడ్ ధర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.. పండుగల సీజన్ లో అప్రమత్తంగా ఉండాలని భావించింది. అందుకే ప్రజల్ని ఇళ్లలోనే వినాయక చవితి వేడుకలు చేసుకోమని సూచించింది. తద్వారా కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు వీలు కలుగుతుందని తెలిపింది. కానీ విపక్షాలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా అందోళనలకు దిగాయి. ప్రజల్ని రెచ్చగొట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే గణేశ ఉత్సవాలను అడ్డుకుంటోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వైసీపీ సర్కార్ కౌంటర్ అటాక్ ప్రారంభించింది.
కేంద్రం రూల్స్ తో కౌంటర్ అటాక్
కేంద్ర ప్రభుత్వం పండుగల సీజన్ ను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ వ్యాప్తి చెందకుండా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తంగా ఉండాలని పదే పదే కోరుతోంది. దీని ప్రకారం ఏపీలోనూ వైసీపీ సర్కార్ గణేశ్ ఉత్సవాలపై ఆంక్షలు పెట్టింది. కానీ ఎప్పుడైతే విపక్ష బీజేపీ, టీడీపీ దీన్ని రాజకీయం చేయడం మొదలుపెట్టాయో అప్పుడు వైసీపీ సర్కార్ కుడా అప్రమత్తమైంది. కేంద్రం తీసుకొచ్చిన మార్గదర్శకాలనే తాము రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తేల్చిచెప్పింది. అంతటితో ఆగకుండా మీకు చేతనైతే కేంద్రం వద్దకు వెళ్లి కోవిడ్ మార్గదర్శకాలు మార్చమని చెప్పాలని సవాల్ విసిరింది. దీంతో కొంత ఆత్మరక్షణలో పడిన బీజేపీ.. ఈసారి హైకోర్టుపై ఆశలు పెట్టుకుంది.
హైకోర్టులో జగన్ సర్కార్ కు ఊరట
ఏపీలో గణేశ్ ఉత్సవాలకు సంబంధించి హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. గణేశ్ ఉత్సవాలపై జగన్ సర్కార్ ఇచ్చిన ఆదేశాలను సమర్ధించింది. అయితే మతపరమైన కార్యక్రమాలను అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి లేదు కాబట్టి బహిరంగ ప్రదేశాలకు బదులు ప్రైవేటు స్ధలాల్లో నిర్వహణకు అనుమతి ఇవ్వాలని సూచించింది. అంతే తప్ప గణేశ్ ఉత్సవాలను యథాతథంగా నిర్వహించుకోవచ్చని మాత్రం చెప్పలేదు. దీంతో జగన్ సర్కార్ కు హైకోర్టులో భారీ ఊరట లభించినట్లయింది. విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్న క్రమంలో జగన్ సర్కార్ కు హైకోర్టు ఆదేశాలు ఊరటనిచ్చాయి.
విపక్షాలకు భారీ షాక్
గణేశ్ ఉత్సవాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇస్తుందని గంపెడాశలు పెట్టుకున్న విపక్ష టీడీపీ, బీజేపీలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం ఆదేశాలు చెంపపెట్టులా మారాయి. ముఖ్యంగా కోవిడ్ వ్యాప్తిని కూడా పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాలను వెతుక్కున్న ఈ రెండు పార్టీలకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు భారీ షాక్ గా మారాయి. కేవలం ప్రైవేటు స్ధలాల్లో గణేశ్ ఉత్సవాల నిర్వహణకు, అదీ ఒకేసారి కేవలం ఐదుగురినే అనుమతించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో విపక్షాలకు దిమ్మ తిరిగినట్లయింది. దీంతో విపక్ష పార్టీలు హైకోర్టు తీర్పును తప్పనిసరిగా పాటించాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.
Recommended Video
కాగల కార్యం హైకోర్టే తీర్చిందా ?
వాస్తవానికి గణేశ్ ఉత్సవాలకు కోవిడ్ నిబంధనల విషయంలో ఇక్కడ వైసీపీ సర్కార్ చేసిందేమీ లేదు. కేవలం కేంద్రం ఇచ్చిన కోవిడ్ మార్గదర్శాకలను క్షేత్రస్ధాయిలో అమలు చేసేందుకు మాత్రం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని రాజకీయ కోణంలో చూస్తూ రచ్చకు ప్రయత్నించిన విపక్షాలు ఆ క్రమంలో కోవిడ్ మార్గదర్శకాలు ఇచ్చింది కేంద్రం అన్న విషయాన్ని సైతం మర్చిపోయాయి. కేవలం రాజకీయ విమర్శలకు పరిమితం అయ్యాయి. దీంతో సహజంగానే ఈ వ్యవహారం హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. మతపరమైన కార్యక్రమాలు ఎంత ముఖ్యమో, కోవిడ్ వ్యాప్తి నుంచి జనాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యంగా భావించింది. దీంతో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను జగన్ సర్కార్ అమలు చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అప్పటివరకూ బీజేపీ, టీడీపీ విమర్శలు, కేంద్రం మౌనంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగన్ సర్కార్ కు కాగల కార్యాన్ని హైకోర్టే తీర్చినట్లయింది. ఎలాగో ఏ కోర్టుకు వెళ్లినా కోవిడ్ నిబంధనలు అమలు చేయొద్దని చెప్పే పరిస్ధితి లేదు. అలాగని వైసీపీ ప్రభుత్వం వీటిని అమలు చేయకుండా రిస్క్ తీసుకునే పరిస్ధితి అంతకన్నా లేదు. కాబట్టి ప్రభుత్వ నిర్ణయానికి అడ్డులేకుండా పోయింది.