ఏపీ హైకోర్టు సంచలన తీర్పు- 8 మంది ఐఏఎస్ లకు జైలుశిక్ష-జరిమానా
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయంలో తీసుకున్న పలు నిర్ణయాల విషయంలో ఇప్పటికే పలువురు అధికారులు హైకోర్టు గడప తొక్కారు. ఇదే క్రమంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయని వ్యవహారంలో ఇవాళ అలాంటి 8 మంది అధికారులకు భారీ షాక్ తగిలింది.
ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయాలని గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై దాఖలైన కేసుపై గతేడాది విచారణ జరిపిన హైకోర్టు.. వీటిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఏడాది గడిచినా ఇంకా సచివాలయాల్ని స్కూళ్లలో నుంచి తొలగించలేదు. దీన్ని హైకోర్టు ధిక్కారంగా భావించింది. ఉద్దేశపూర్వకంగానే సదరు అధికారులు కోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వీరిపై ఇవాళ జరిగిన విచారణలో కీలక నిర్ణయం తీసుకుంది.

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు 8 మంది ఐఏఎస్ అధికారులపై కన్నెర్ర చేసింది. వీరికి రెండు వారాల జైలుశిక్ష విధించడంతో పాటు జరిమానా కూడా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. వీరిలో విజయ్ కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేదీ, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, చినవీరభద్రుడు, ఎంఎం నాయక్ ఉన్నారు. హైకోర్టు ఆగ్రహంతో ఐఏఎస్ అధికారులు క్షమాపణలు చెప్పారు. దీంతో జైలుశిక్షకు బదులుగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని తీర్పులో మార్పు చేసింది. ఏడాది పాటు సంక్షేమ హాస్టళ్లకు వెళ్లి సేవ చేయాలని వీరికి ఆదేశాలు ఇచ్చింది. విద్యార్ధుల మధ్యాహ్నం, రాత్రి భోజన ఖర్చులతో పాటు ఒక రోజు హైకోర్టు ఖర్చులు కూడా భరించాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications