పీఆర్సీ పిటిషన్ పై మరో ట్విస్ట్-హైకోర్టు కీలక నిర్ణయం-ఛీఫ్ జస్టిస్ ధర్మాసనానికి బదిలీ
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారంలో గంటగంటకూ పరిణామాలు మారిపోతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోల్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన గెజిటెడ్ అధికారుల సంఘం.. ఇవాళ విచారణకు హాజరైంది. అయితే హైకోర్టు పీఆర్సీపై నిర్ణయం ప్రభుత్వానిదేనని వ్యాఖ్యలు చేసింది. అనంతరం సమ్మె నోటీసు ఇవ్వబోతున్న 12 మంది ఉద్యోగసంఘాల నేతల్ని కూడా హైకోర్టుకు రావాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే మధ్యాహ్నానికి పరిస్దితి మారిపోయింది.
Recommended Video
ఉదయం విచారణ తర్వాత మరోసారి మధ్యాహ్నం విచారణ ప్రారంభించిన హైకోర్టు సింగిల్ బెంచ్.. గెజిటెడ్ ఉద్యోగులసంఘం దాఖలు చేసిన పిటిషన్ ను ఛీఫ్ జస్టిస్ ధర్మాసనానికి బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పీఆర్సీ పిటిషన్ పై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని సింగిల్ బెంచ్ న్యాయమూర్తి వెల్లడించారు. దీంతో ఈ పిటిషన్ ను ఛీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు పంపుతున్నట్లు ప్రకటించారు. ఈ పిటిషన్ ప్రజా ప్రయోజన వాజ్యంగా గుర్తిస్తూ దానిపై విచారణ జరిపే బెంచ్ ను ఛీఫ్ జస్టిస్ నిర్ణయానికి పంపుతున్నారు. ఏపీలో ఉన్న అందరి ప్రయోజనాలు ఈ పిటిషన్ పై ఆధారపడి ఉన్నాయని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
మరోవైపు పీఆర్సీ పిటిషన్ పై ఉదయం సమ్మెకు నోటీసు ఇచ్చిన ఉద్యోగసంఘాల నేతలందరినీ హైకోర్టుకు రావాలని ఆదేశాలు ఇచ్చిన సింగిల్ బెంచ్ మధ్యాహ్నానికి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. అయితే హైకోర్టు కోరిన విధంగా ఉద్యోగసంఘాల నేతలు మాత్రం హాజరుకాలేదు. తాము పిటిషన్ వేయనప్పుడు కోర్టుకు ఎలా హాజరవుతామని నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఉద్యోగుల్ని హైకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నుంచి ఫోన్ వచ్చినా వారు మాత్రం వెళ్లకపోవడం విశేషం.