అతి త్వరలో....ఆంధ్రప్రదేశ్ పాలనారంగంలో మరో సరి కొత్త వ్యవస్థ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పాలనారంగానికి సంబంధించి అతి త్వరలో ఒక కొత్త వ్యవస్థ ఏర్పాటుకానుంది. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నూతన వ్యవస్థ కేవలం మరో 20 రోజుల్లో అందుబాటులోకి రానుంది.
ప్రజల సమస్యలను, ప్రజాభిప్రాయాలను సత్వరమే ప్రభుత్వానికి చేరవేయడానికి, తద్వారా ప్రజానుకూల పాలన సాగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధికార మిత్ర అనే సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. వీరి ద్వారా ప్రజా సంక్షేమం మరింత మెరుగుపర్చాలనేది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.

ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మంది సాధికార మిత్ర లను నియమించింది. ప్రతి 35 కుటుంబాలను ఒక క్లస్టర్ గా తీసుకొని రాష్ట్రంలోని 1.04 కోట్ల గ్రామీణ కుటుంబాలు తమ సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఈ సాధికార మిత్రలను వినియోగించనున్నారు.
సాధికార మిత్రల నియామకాలను సైతం గ్రామీణ పేదరిక నిర్మూలనా శాఖ( సెర్ప్) ఇప్పటికే పూర్తిచేసేసింది. డ్వాక్రా సభ్యులై ఉండి సేవాభావం కలిగిన 35 ఏళ్ళ లోపు వయసు వారిని ఇందుకోసం ఎంపిక చేశారు. వీరికి కనీస అర్హత 8వ తరగతిగా నిర్ణయించారు.
అలాగే వీరు ఒక స్మార్ట్ ఫోన్ సైతం కలిగి ఉండాలి. వీరందరికీ సరైన శిక్షణ ఇచ్చి ఒక గుర్తింపు కార్డును ఇవ్వనున్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా వీరికోసం ఒక ప్రత్యేక యాప్ ను కూడా రూపొందిస్తున్నారు. వీరి ఫోన్లలో ప్రభుత్వమే ఒక ఉచిత సిమ్ వేయిస్తుంది. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రస్తుతం ఉన్న 1100 కాల్ సెంటర్ లోనే అదనంగా మరో 250 మందితో మరో విభాగాన్నికూడా ఏర్పాటు చేయనున్నారు. మరో 20 రోజుల్లో ఇవన్నీ పూర్తయి రాష్ట్రంలో ఒక నూతన వ్యవస్థ ఏర్పడనుంది. ప్రజాసమస్యలు తక్షణం పరిష్కారం కానున్నాయి.












Click it and Unblock the Notifications