ఏపీకీ మరోసారి వానగండం.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల (నవంబర్) 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు కురువనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం నవంబర్ 26వ తేది లేదా 27వ తేది నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా వస్తుందని అధికారులు భావిస్తున్నారు. దీని ప్రభావం ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై పడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో...
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో చలి తీవ్రత కూడా ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో విపరీతమైన మంచు కూడా కురుస్తోంది. దీంతో ప్రజలు బయటికి రావాలంటే చాలా ఇబ్బందిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో 18 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అంటున్నారు. హైదరాబాద్తో పాటూ పలు జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని, చలి దెబ్బకు ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు.
రెండు తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. రానున్న ఐదు రోజుల్లో తూర్పు, పశ్చిమ, వాయువ్య, మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్కు తగ్గే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఈ నెల 17వ తేది నుంచి 19వ తేదీ వరకు పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోంతో పాటుగా మేఘాలయలోని వివిధ ప్రాంతాలలో పొగమంచు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications