మంత్రి హోదాలో హస్తిన పర్యటనకు రెండోసారి నారా లోకేష్: ఐటీ మంత్రుల సమావేశంలో ఫైబర్నెట్
ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ అండ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఎపి ఐటి మంత్రి హోదాలో దేశ రాజధాని హస్తిన పర్యటనకు వెళ్లారు లోకేష్.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ అండ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంత్రి హోదాలో లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి మాత్రమే కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో లోకేష్ తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో ఎపిలో కంపెనీల స్థాపన, పెట్టుబడులు పెట్టే విషయమై మాట్లాడారు.
Recommended Video
అయితే లోకేష్ ఢిల్లీలో ఉన్న అదే సమయంలో మరో మంత్రి నారాయణ కుమారుడు చనిపోవడంతో మధ్యలోనే లోకేష్ తన పర్యటనను విరమించుకుని నెల్లూరుకు వచ్చేశారు. అనంతరం ఏపీలో పెట్టుబడుల కోసం ఐటి కంపెనీలను ఆహ్వానించేందుకు ముంబై, బెంగుళూరులలో పర్యటించారు.
తాజాగా ఇప్పుడు మరోసారి ఎపి ఐటి మంత్రి హోదాలో దేశ రాజధాని హస్తిన పర్యటనకు వెళ్లారు లోకేష్. ఈనెల 13న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఐటీ మంత్రుల సమావేశంలో లోకేష్ పాల్గొంటారు. దేశంలోని అన్ని పంచాయతీలకు అంతర్జాల సదుపాయం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశంలో మరిన్ని కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఫైబర్నెట్ పథకం చేపట్టి ప్రతి ఇంటికి ఇంటర్ నెట్ సదుపాయం కల్పించే ప్రక్రియను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ మంత్రుల సమావేశంలో మంత్రి లోకేష్ మన రాష్ట్రంలో అమలు చేస్తున్న ఫైబర్నెట్ కార్యక్రమం గురించి, అలాగే తమ ప్రభుత్వం చేపట్టబోయే ఐటి సంబంధిత కార్యకలాపాల గురించి ప్రసంగించనున్నారు.
సమావేశం అనంతరం లోకేష్ ఢిల్లీలో పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరపనున్నట్లు తెలిసింది. నవ్యాంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల కోసం ఆహ్వానించే లక్ష్యంతో ఈ చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.