ఏపీ సర్కార్ కు ఉద్యోగుల షాక్..! మూడు దశల్లో ఉద్యమం- కార్యాచరణ ప్రకటన..!
ఏపీలో ఉద్యోగుల సమస్యల విషయంలో కూటమి సర్కార్ (AP Govt) అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఉద్యోగులు (Employees) నిరసన బాట పట్టబోతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వివిధ ఉద్యోగ సంఘాలతో కూడిన ఏపీ జేఏసీ అమరావతి (AP JAC Amaravati) మూడు దశల ఉద్యమం చేపట్టబోతున్నట్లు ప్రకటించింది. అంతే కాదు దశల వారీగా ఉద్యమంలో భాగంగా చేపట్టే నిరసనల జాబితానుసైతం విడుదల చేసింది. ఉద్యోగుల హక్కుల సాధనకోసం ఉద్యమానికి సిద్దపడుతున్నామని జేఏసీ నేతలు ప్రకటించారు.
ఉద్యోగుల ఆత్మగౌరవం కాపాడేందుకు కలసి పోరాడుదాం, ఐక్య ఉద్యమాలకు కలసి రావాలని ఉద్యోగులకు నేతలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మొదటి దశలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఉద్యమం చేపట్టబోతున్నారు. ఆగస్టు 31న పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్లకు ఉద్యమ నోటీసులు ఇస్తారు. సెప్టెంబర్ 15 నుంచి వర్క్ టూ రూల్ ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 1న సీఎం సార్ మా డబ్బులు మాకివ్వండి నినాదంతో సెల్ఫోన్ డీపీల ద్వారా నిరసన తెలుపుతారు. సెప్టెంబర్ 1-5 వరకూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతారు.

సెప్టెంబర్ 2 నుండి 8 వరకూ హ్యాండ్ టూ హ్యాండ్ కార్యక్రమం ద్వారా కార్యాలయాల సందర్శన, ఉద్యోగులను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం చేస్తారు. సెప్టెంబర్ 3 నుండి 5వ తేదీ వరకూ లంచ్ అవర్ లో నిరసనలు తెలుపుతారు. సెప్టెంబర్ 11న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులతో తదుపరి ఉద్యమ కార్యాచరణపై చర్చ ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు రెండో దశ కార్యాచరణ ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 15-26 మధ్య ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్క్ టూ రూల్ ఉద్యమం చేపడతారు. సెప్టెంబర్ 15-22 మధ్య సోషల్ మీడియాలో డీపీలు, ఫొటోలు, రీల్స్ ప్రచారం చేస్తారు. సెప్టెంబర్ 15-25 మధ్య ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇస్తారు. సెప్టెంబర్ 17న నల్ల కండువాలతో నిరసన చేస్తారు. సెప్టెంబర్ 23న కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు, 26న ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిసి మా డబ్బులు మాకివ్వండి నినాదంతో ధర్నాలు చేస్తారు. అనంతరం మూడో దశ కార్యాచరణ ప్రకటిస్తారు.














Click it and Unblock the Notifications