కర్నూల్లో హైకోర్టు బెంచ్ పైఏపీ సర్కార్ మరో కీలక అడుగు..!
ఏపీలో హైకోర్టు విభజనపై ఇవాళ ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం..కార్యనిర్వాహక ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా హైకోర్టు రిజిస్ట్రార్ కు కర్నూల్లో బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయ శాఖ ఓ లేఖ రాసింది. ఇందులో పలు కీలక అంశాల్ని ప్రభుత్వం ప్రస్తావించింది.
గతంలో యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీతో పాటు సీఎం చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు హైకోర్టు బెంచ్ ను కర్నూల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయశాఖ కార్యదర్శి హైకోర్టు రిజిస్టార్ కు లేఖ రాశారు. 1952లో కర్నూలు భాష ప్రయుక్తంగా ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్రానికి రాజదానిగా ఉందని, ఆ తర్వాత హైదరాబాద్ కు రాజదాని మారిందని ఈ లేఖలో తెలిపారు. అప్పటి నుంచి కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రజల నుంచి డిమాండ్ ఉందన్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతికి మారిందన్నారు.

మద్రాస్ హైకోర్టుకు మదురైలో, కలకత్తా హైకోర్టుకు జల్పాయ్ గురిలో, అలహాబాద్ హైకోర్టుకు లక్నోలో, మధ్యప్రదేశ్ హైకోర్టుకు జలబ్ పూల్, గ్వాలియర్, ఇండోర్ లో, బోంబే హైకోర్టుకు నాగ్ పూర్, ఔరంగాబాద్, పనాజీలో, రాజస్థాన్ హైకోర్టుకు జైపూర్ లో, గౌహతి హైకోర్టుకు కోహిమా, ఐజ్వాల్, ఇంఫాల్, అగర్తల, షిల్లాంగ్, ఇటానగర్ లో బెంచ్ ల ఉన్నాయని గుర్తుచేశారు. హైకోర్టు ఉన్న కేంద్రం బయట కొత్త బెంచ్ లు ఏర్పాటు చేయాలంటే సీజేతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి అంగీకారం అవసరమని తెలిపారు.
రాయలసీమలో విభజనకు ముందు నాలుగు జిల్లాలు ఉండేవని, ఇప్పుడు 8 జిల్లాలున్నాయని, దాదాపు కోటిన్నర జనాభా ఇక్కడ నివసిస్తున్నారని ఈ లేఖలో ప్రభుత్వం తెలిపింది. సీమలో జనాభా రాష్ట్ర జనాభాలో 25 శాతం కంటే ఎక్కువని, భూభాగం 43 శాతమని తెలిపింది. రాయలసీమ నుంచి అమరావతిలో హైకోర్టు దూరంగా ఉందని, కర్నూలు నుంచి కానీ కడప నుంచి విజయవాడకు ఒక్క రైలు కూడా లేదని పేర్కొన్నారు. ఈ ప్రాంతం నుంచి వచ్చే కేసులు మూడో వంతు ఉన్నాయని, ఇవన్నీ హైకోర్టులో పెండింగ్ కూడా ఉన్నాయని తెలిపారు. వీటిని దృష్టిలో ఉంచుకుని కర్నూల్లో బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications