కోస్తాంధ్ర వరకూ విస్తరించిన ద్రోణి: ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
Bay of Bengal: బంగాళాఖాతంలో తాజాగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కొనసాగినా ఆ తరువాత వాతావరణం చల్లగా మారుతుందని, వేడిగాలుల ఉధృతి తగ్గుముఖం పట్టొచ్చు.
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన సమయంలో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమ వరకూ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడ్డాయి. ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.

ఆ తరువాత మళ్లీ రుతు పవనాలు బ్రేక్ తీసుకున్నాయి. వాటి కదలికలు మందగించాయి. ఫలితంగా- ఉష్ణోగ్రత మళ్లీ మొదటికొచ్చింది. 40 డిగ్రీలకుపైగా ఎండ తీవ్రత కనిపించింది. వేడిగాలులూ వీచాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరికి గురి అయ్యారు. నడివేసవి పరిస్థితులను చవి చూశారు.
ఇప్పుడు తాజాగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. రుతుపవనాలు కనికరించకపోయినప్పటికీ- బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా.. ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుండి కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించింది.
ఫలితంగా నేడు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ఎండ తీవ్రత కూడా ఉంటుంది.
ఉక్కపోతతో పాటు 40 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ, రాజమండ్రి, అనకాపల్లి, విశాఖపట్నం, అరకు, శ్రీకాకుళం, ఏలూరు, విజయవాడ, చిత్తూరు, తిరుపతిల్లో సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications