Passport, Visa సేవలు బంద్! ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన..
కువైట్లో నివసిస్తున్న భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం ఒక ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. కొన్ని పరిపాలనాపరమైన కారణాల (Administrative Reasons) వల్ల ఎంబసీ పరిధిలోని కాన్సులర్, పాస్పోర్ట్, వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆంక్షలు జులై 19, ఆదివారం వరకు అమలులో ఉంటాయని, ఈ సమయంలో కేవలం ఎమర్జెన్సీ కేసులను మాత్రమే ప్రాసెస్ చేస్తామని ఎంబసీ ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. తమ అభ్యర్థనలో ఉన్న అత్యవసరతను సరైన పత్రాలతో నిరూపించగల దరఖాస్తుదారులను మాత్రమే ఈ సమయంలో ఎంబసీ సేవలకు అనుమతిస్తారు.

అత్యవసర సేవలు ఇవే..
ఈ తాత్కాలిక ఆంక్షల కాలంలో కొన్ని రకాల అత్యవసర సేవలను మాత్రం ఎంబసీ యథాతథంగా కొనసాగించనుంది.
- తత్కాల్ పాస్పోర్ట్ జారీ
- ఎన్నారై (NRI) సర్టిఫికెట్లు
- కువైట్ సివిల్ ఐడీ (Civil ID) గడువు ముగియడానికి దగ్గరగా ఉన్న వారికి తక్కువ కాల పరిమితి గల పాస్పోర్టుల జారీ
- ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు, ఈ-వీసాలు (e-Visas)
అయితే, సాధారణ పాస్పోర్టుల దరఖాస్తులు (Normal Passports), అటెస్టేషన్లు (ధృవీకరణలు), రెగ్యులర్ వీసాల ప్రాసెసింగ్ను తాత్కాలికంగా పూర్తిగా నిలిపివేశారు. ఈ ఆంక్షలు ఎత్తివేసే వరకు ఇలాంటి సాధారణ దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని ఎంబసీ స్పష్టం చేసింది.
అప్లికేషన్ సెంటర్లు బంద్..
ఈ ఆంక్షలతో పాటు కువైట్లోని అన్ని భారతీయ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లు (ICAC) కూడా తదుపరి నోటీసు వచ్చే వరకు పూర్తిగా మూసివేయనున్నట్లు ఎంబసీ ప్రకటించింది. అత్యవసర సహాయం కొరకు దరఖాస్తుదారులు నేరుగా ఎంబసీలోని కాన్సులర్ వింగ్ను సందర్శించాల్సి ఉంటుంది.
ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల మధ్య మాత్రమే అధికారులు అందుబాటులో ఉంటారని, సరైన పత్రాలు ఉండి, నిజమైన అత్యవసర కేసుగా నిర్ధారణ అయితేనే అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలిస్తారని ఎంబసీ వెల్లడించింది. ఈ విషయాలపై తదుపరి అప్డేట్లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని, కువైట్లోని భారతీయులు తాజా సమాచారం కోసం ఎంబసీ అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను ఫాలో అవ్వాలని అధికారులు సూచించారు.














Click it and Unblock the Notifications