ఆగస్టు 15 తర్వాత బంద్! స్విగ్గీ, జొమాటోలకు హోటళ్ల డెడ్లైన్
ఆన్లైన్ ఫుడ్ లవర్స్కు త్వరలోనే పెద్ద షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖ డెలివరీ యాప్లు స్విగ్గీ, జొమాటోల నియంతృత్వ ధోరణి, అధిక కమీషన్లపై స్థానిక హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు తిరుగుబాటు జెండా ఎగరేశారు. తమ దీర్ఘకాలిక సమస్యలు, నష్టాలకు కారణమవుతున్న నిబంధనలను సవరించకపోతే ఆగస్టు 15 నుంచి ఈ యాప్ల ద్వారా ఆర్డర్లు స్వీకరించేది లేదని 'బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్' (బీబీహెచ్ఏ) స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
హోటళ్ల యజమానుల ప్రధాన ఆవేదన కమీషన్ల బాదుడుపైనే. వ్యాపారాన్ని బట్టి 8 శాతం నుంచి ఏకంగా 28 శాతం వరకు కమీషన్ల రూపంలో యాప్లు వసూలు చేస్తున్నాయని హోటల్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఒక హోటల్ యజమానికి రూ.100 దక్కాలంటే, యాప్ కమీషన్లు పోను మెనూ ధరను ఏకంగా 43 శాతం వరకు పెంచాల్సి వస్తోందని వారు వివరిస్తున్నారు. అంతిమంగా ఈ భారం సామాన్య కస్టమర్ల జేబులపైనే పడుతోందని, హోటళ్లకు వచ్చే లాభం మాత్రం పూజ్యమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సహించేది లేదు.. పారదర్శకత ఉండాల్సిందే!
కేవలం కమీషన్లే కాకుండా అనేక రకాల దాగుడుమూతల చార్జీలతో చిన్న చిన్న రెస్టారెంట్లు దారుణంగా నష్టపోతున్నాయని సంఘం ప్రతినిధులు పేర్కొంటున్నారు. కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల పేరుతో బిల్లులో కోతలు విధించడం, ఆహారం సిద్ధమయ్యాక ఆర్డర్ రద్దయితే ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడం, యాప్లో ముందు వరుసలో చూపించేందుకు యాడ్స్ పేరుతో రుసుములు వసూలు చేయడం వంటి చర్యలను తీవ్రంగా ఖండించారు. హోటల్ యజమానుల అనుమతి లేకుండానే ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించి ఆ నష్టాన్ని తమ ఖాతాలో వేస్తున్నారని, ఈ బిల్లింగ్ వ్యవహారాలన్నింటిలో స్పష్టమైన పారదర్శకత రావాలని డిమాండ్ చేస్తున్నారు.
కొత్త వేదికల వైపు చూపు.. పోటీ పెరిగితేనే ఊరట!
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏకఛత్రాధిపత్యానికి తెరదించేందుకు కొత్త ప్లాట్ఫారమ్లను ప్రోత్సహించేందుకు సిద్ధమవుతున్నట్లు హోటల్ రంగానికి చెందిన ప్రముఖులు చెబుతున్నారు. కమీషన్లు లేని మోడల్తో వస్తున్న రాపిడో 'ఓన్లీ' (Ownly), తక్కువ కమీషన్లతో అడుగుపెడుతున్న ఫ్లిప్కార్ట్, ఓఎన్డీసీ (ONDC) వంటి కొత్త వేదికలు మార్కెట్లోకి వస్తే పోటీ పెరిగి అందరికీ మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు 15 వరకు సమయం.. లేకపోతే బహిష్కరణే!
ఈ సమస్యలపై తమ డిమాండ్లతో కూడిన విజ్ఞప్తి పత్రాన్ని స్విగ్గీ, జొమాటో యాజమాన్యాలకు అందజేస్తామని, ఆగస్టు 15 లోగా సరైన పరిష్కారం చూపకపోతే బెంగళూరు వ్యాప్తంగా ఆన్లైన్ డెలివరీలను పూర్తిగా బహిష్కరిస్తామని అసోసియేషన్ స్పష్టం చేసింది. హోటల్ యజమానులు తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications