రాస్కో కేసీఆర్! భద్రాచలం రాముడిపై ఆన.. పాతాళానికి తొక్కేస్తాం!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలు 17 నుంచి 26కి, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కి పెరుగుతాయని సీఎం ప్రకటించారు. 36 నెలల ముందుగానే ఎన్నికల ఫలితాల జోస్యం చెబుతున్నట్లు వ్యాఖ్యానించిన ఆయన, "182 అసెంబ్లీ స్థానాల్లో 117 సీట్లు గెలిచి రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది" అని ధీమా వ్యక్తం చేశారు. మ్మం జిల్లా మధిర నియోజకవర్గం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుభరోసా తుది విడత సాయం పంపిణీ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు
బీఆర్ఎస్ కు బొంద పెట్టారు...
రాజకీయంగా పాలమూరు తనకు ప్రాణమైతే.. ఖమ్మం జిల్లా గుండెకాయ లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క కోరిక మేరకు మధిరకు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేస్తామని హమీ ఇచ్చారు. 2023 జూలైలో పొంగులేటి చేరిక సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలు ఉప్పెనలా వచ్చి బీఆర్ఎస్ కు బొంద పెట్టారని రేవంత్ ఎద్దేవా చేశారు. సరిగ్గా ఇప్పుడు అదే జూలై లో బీఆర్ఎస్ ను మళ్లీ మొలకెత్తనివ్వమని చింతకాని సభకు వేలాదిగా తరలి వచ్చిన మీకు అభినందనలు అంటూ తన ప్రసగించారు.

2023 లో ప్రభుత్వ ఏర్పాటు నుంచి ప్రతీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించి... పాపాల భైరవున్ని ఫామ్ హౌస్ లోనే బందీ చేశారు. జరగబోయే కురుక్షేత్రంలో కౌరవ కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయ ముఖచిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరు. వచ్చే సాధారణ ఎన్నికలు 2028 డిసెంబరులో జరగవు. 2029 మే లేదా జూన్ మాసంలో జరుగుతాయి . తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు 26కు పెరుగుతాయి. 119 అసెంబ్లీ స్థానాలు 182 కు పెరుగుతాయి. 36 నెలల ముందుగానే వచ్చే ఎన్నికల ఫలితాల జోస్యం చెబుతున్నా.. 182 అసెంబ్లీ స్థానాల్లో 117 సీట్లు గెలిచి రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. - సీఎం రేవంత్ రెడ్డి
రాములోరి మీద ఆన
భద్రాచలం రాములవారి మీద ఆన... ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట అంటూ తన స్వరాన్నిపెంచిన సీఎం రేవంత్.. " రాస్కో చంద్ర శేఖర్ రావు... నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలు గుర్తు పెట్టుకోండి. ఈ మాట కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తాం అంటూ సవాల్ విసిరారు. ప్రతీ సందర్భంలో ప్రజా ప్రభుత్వం రైతులను ఆదుకుంటోందని పేర్కొన్న సీఎం. కేసీఆర్ కుటుంబంలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని.. ఒకే ఇంట్లో రెండు గుంపులున్నాయని విమర్శించారు. ఒకరిపై ఒకరు పోటీగా ఒకాయన కన్నెపల్లికి పోయి పంపులు ఆన్ చేయాలంటాడని మండిపడ్డారు. ఒకసారి మేడిగడ్డ కుంగితేనే ఇంత నష్టం జరిగిందన్ని సీఎం.. మళ్లీ నీళ్లు నింపితే భద్రాచలం రాముడు మునుగుతాడని చెప్పుకొచ్చారు.
ఖమ్మం జిల్లాలో 44 ఊర్లు కొట్టుకుపోయాయి దుర్మార్గుడా... నీ దుష్ట రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలా అని అడిగితే సమాధానం లేదు. రేవంత్ రెడ్డి సర్వేలో కాంగ్రెస్ ఓడిపోతుందని దుష్ప్రచారానికి దిగారు. ఎన్నికలు ఎప్పుడో తెలియకుండా, రిజర్వేషన్లు ఎలా మారుతాయో తెలియకుండా ఎవరైనా సర్వేలు చేస్తారా.. గెలుపు ఓటములు నిర్ణయిస్తారా? జూబ్లీహిల్స్ లో ఇలాగే చెబితే జనం బీఆర్ఎస్ ను బండకేసి కొట్టారు. బ్యాడుమేళం బ్యాచ్ లా బీఆరెస్ సర్వేల బ్యాచ్ తయారైంది. బీజేపీ లోకి వెళ్ళనని హరీష్ రావును కెసీఆర్ పై ఒట్టేసి చెప్పమను. నువ్వు ఎక్కడుంటావో తెలియదు.. మీ బావ ఎటు పోతాడో తెలియదు. బీఆర్ఎస్ ను బీజేపీ లో విలీనం చేస్తారని నీ సొంత చెల్లెలే చెబుతోంది. ఆంధ్ర కాంట్రాక్టర్లు మీ పార్టీకి వందల కోట్లు ఇచ్చారని నీ సొంత చెల్లే చెప్పింది. బీఆరెస్ అమలు చేసిన షాది ముబారక్, రైతు బందు పథకాలను మేం కొనసాగించడం లేదా? ప్రతీ పేదవాడికి రేషన్ కార్డు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం. రైతు భరోసాను రూ.12 వేలకు పెంచాం, రైతు రుణమాఫీ చేసి రుణవిముక్తులను చేశాం . రాబోయే ఎన్నికల్లో తెలంగాణ నుంచి 26 పార్లమెంట్ స్థానాలకు 20 పార్లమెంట్ స్థానాలు గెలిపిద్దాం. రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందాం. ఔర్ ఏక్ బార్... కాంగ్రెస్ సర్కార్... - సీఎం రేవంత్ రెడ్డి.














Click it and Unblock the Notifications