వర్షాలు, వరదలతో నదులు, రిజర్వాయర్ లకు జలకళ.. తెలంగాణా వ్యాప్తంగా తాజా పరిస్థితి ఇదే
తెలంగాణా ఈరోజు కృష్ణా నది బేసిన్లోని ప్రధాన జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుండి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుండి వస్తున్న నీటి కారణంగా జూరాల ప్రాజెక్టుకు సుమారు 32,000 నుండి 46,580 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, అధికారులు విద్యుత్ ఉత్పత్తి మరియు గేట్ల ద్వారా దాదాపు 30,700 నుండి 44,254 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జూరాల నుండి శ్రీశైలానికి వరద ఇన్ ఫ్లో ఎలా ఉందంటే
జూరాల నుండి వస్తున్న నీటి ప్రవాహం వల్ల శ్రీశైలం జలాశయానికి 27,210 నుండి 35,913 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతుంది, అయితే ప్రస్తుతం స్పిల్ వే గేట్లు ఎత్తకుండా కేవలం తాగునీటి అవసరాలు మరియు కాలువల కొరకు మాత్రమే సుమారు 1,600 క్యూసెక్కుల అవుట్ ఫ్లోను వదులుతున్నారు.

నాగార్జున సాగర్ తాజా పరిస్థితి ఇలా
ఇక శ్రీశైలం నుండి దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి ఇంకా పెరగకపోవడంతో, ప్రస్తుతం అక్కడ ఇన్ ఫ్లో మరియు అవుట్ ఫ్లో రెండు కూడా సాధారణ తాగునీటి అవసరాలకు సరిపడా 900 నుండి 5,647 క్యూసెక్కుల మధ్య అతి తక్కువ స్థాయిలో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోనూ, ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వాగులు , వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు , రిజర్వాయర్ లు జల కళను సంతరించుకున్నాయి.
గోదావరిలో వరద ఉదృతి
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం నది నీటిమట్టం 27 అడుగులుగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాల కారణంగా.. నదికి వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా, ప్రసుత్తం 13.93 టీఎంసీలు ఉంది. నీటిమట్టం 148 మీటర్లు కాగా, ప్రస్తుతం 145.58 మీటర్లుగా ఉంది.
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ఫ్లో 78,034 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 16,025 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరొచ్చి చేరుతోంది. గురువారం ప్రాజెక్టులోకి 3935 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. ప్రస్తుతం నీటిమట్టం 1395.8 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుతం 7.46 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
సింగూరు జలాశయానికి వరద ప్రవాహం
సింగూరు జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది.నిర్మల్ జిల్లా భైంసాలో గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి 4500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 355.8 మీటర్లుగా ఉంది.














Click it and Unblock the Notifications