పక్కా ఆధారాలతో వైసీపీని ఇరికించే పనిలో టీడీపీ .. స్థానిక ఎన్నికలపై మరో వ్యూహం
ఏపీలో అధికార పార్టీనే కాదు ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ కూడా ద్విముఖ వ్యూహం అమలు చేస్తుంది .అధికార పార్టీ అయిన వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఒకపక్క ఏకగ్రీవాలపై దృష్టి పెట్టి మరోపక్క పార్టీలోకి కీలక నేతల వలసలను ప్రోత్సహించింది . ఇక టీడీపీ కూడా తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో ద్విముఖ వ్యూహం అనుసరించాలని నిర్ణయం తీసుకుంది.

స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో టీడీపీ వ్యూహాలు
ఒకపక్క టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రాష్ట్రంలో దాడులను, దౌర్జన్యాలను, బెదిరింపులను వీడియో, ఫోటో చిత్రీకరణ చేసి కంట్రోల్ రూమ్ కు పంపించాలని పార్టీ శ్రేణులకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయినప్పటికీ వీడియో, చిత్రాల ఆధారంగా చంద్రబాబు ఎన్నికల కమీషన్ కు వైసీపీ దాడులు, దౌర్జన్యాలపై, అలాగే ప్రేక్షక పాత్ర పోషించిన , అధికార పార్టీకి వత్తాసు పలికిన పోలీసులపై ఆధారాలతో ఫిర్యాదు చేశాయి. ఇక ప్రస్తుతానికైతే ఆరు వారాల పాటు ఎన్నికలకు బ్రేక్ పడింది. దీనిపై వైసీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

ప్రభుత్వ భవనాల రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశించినా .. అలాగే రంగులు
ఇక ఇదే సమయంలో టీడీపీ మరో వ్యూహం సిద్ధం చేస్తుంది. వారం రోజుల కిందట ఏపీ హైకోర్టు ప్రభుత్వ భవనాలపై ఉన్న వైసీపీ రంగులన్నింటినీ పది రోజుల్లోపు తొలగించాలని ఆదేశించింది. తొలగించకపోతే సంబంధిత అధికారుల్ని బాధ్యుల్ని చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేసింది. పది రోజుల్లోగా తొలగించి ప్రమాణ పత్రం దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కానీ ఇప్పటివరకు రంగులు తొలగించలేదు . ఇప్పటికి వారం రోజులు అయినా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు . ప్రభుత్వ భవనాలపై ఉన్న రంగులన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి.

రంగులు తొలగించని కార్యాలయాల ఫోటోలు, వీడియోలు పంపాలని ఆదేశం
దీంతో ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న రంగులను తొలగించని చోట్ల ఆ ఫోటోలను, వీడియోలను తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల అంశంపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. గ్రామాల్లో ఉన్న పార్టీ శ్రేణులకు రంగులున్న భవనాల ఫోటోలు పంపాలని సమాచారం ఇస్తోంది. ఆ మేరకు మొత్తం సమాచారాన్ని సేకరించి, రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎన్నికల కోడ్ను అమలు చేయలేకపోతోందని, ఒకపక్క కోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం లెక్క లేకుండా ప్రవర్తిస్తుందని టీడీపీ వైసీపీని ఇరికించే వ్యూహం సిద్ధం చేస్తుంది .

కోర్టు ధిక్కరణ పేరుతో హైకోర్టును ఆశ్రయించే అవకాశం
ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఈ ఆధారాలతో హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి వైసీపీ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలను జాగ్రత్తగా విజువలైజ్ చేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ భవనాలకు ఉన్న రంగు కోర్టు విధించిన గడువు లోగా తొలగించకపోతే మరో మారు కోర్టు మెట్లెక్కి వైసీపీని ఇబ్బంది పెట్టాలని నిర్ణయం తీసుకుంది టీడీపీ .












Click it and Unblock the Notifications