'కేసీఆర్ ఒక్క అడుగేస్తే మేం వంద', జగన్పై దేవినేని సంచలనం
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ పైన ఒక్క అడుగు వేస్తే, మేం వంద అడుగులు వేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం నాడు హెచ్చరించారు.
టేపులు అన్నీ తొలుత టీ చానళ్లో ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. ఈ ఎపిసోడ్ అంతా ఏసీబీ కంట్రోల్లో జరిగిందన్న అనుమానం వ్యక్తమవుతోందని చెప్పారు. ప్రయివేటు వ్యక్తులతో కలిసి కుట్ర చేశారన్నారు. అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న జగన్ తమ పైన ఫిర్యాదు చేయడం విడ్డూరమన్నారు.
వైసీపీలో చేరిన బొత్స సత్యనారాయణ పేరు చెబితేనే వ్యోగ్స్ వాగన్ గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. తమ పైన కేసీఆర్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు.
వైసీపీ, తెరాసలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఏసీపీ, కోర్టు పరిధిలో ఉండవలసిన ఆడియో రికార్డులు బయటకు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. చంద్రబాబు ఆడియో టేప్ పైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహారంతో తమకు సంబంధం లేదన్నారు. రేవంత్ తప్పు చేస్తే అనుభవిస్తారన్నారు. లేకపోతే నిర్దోషిగా వస్తారన్నారు. అది కోర్టులో ఉన్నందున అంతకుమించి దానిపై మాట్లాడమన్నారు.
బ్రదర్ అనిల్ కుమార్కు, స్టీఫెన్ సన్కు సంబంధాలు ఉన్నాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ కుట్రలో జగన్ హస్తం ఉందన్నారు. తెలంగాణలోను ప్రముఖ నాయకులు, ఉద్యమ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారన్నరు. చంద్రబాబుకు ప్రాణహానీ ఉందని చెప్పారు.
పట్టిసీమను ఆపాలని జగన్ చెప్పారు: దేవినేని
పట్టిసీమ ప్రాజెక్టును ఆపాలని వైసీపీ అధ్యక్షులు జగన్ రాష్ట్రపతిని కోరారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సంచలన వ్యాఖ్య చేశారు. ఏపీ రైతులను జగన్ మోసం చేస్తున్నారని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రం జోక్యం చేసుకోవాలి: బొజ్జల, పితాని
ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన నేరమని, దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి, పితాని సత్యనారాయణలు డిమాండ్ చేశారు.
63 మంది ఎమ్మెల్యేలు ఉన్న కేసీఆర్ ఐదుగురు అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా బరిలోకి దింపారని ప్రశ్నించారు. 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీ సీటుకు పోటీ చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు.