ఐసీఐడీ కాంగ్రెస్లో మంత్రి అంబటి రాంబాబు - కొత్త గెటప్తో క్లిక్
అమరావతి: జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 7వ తేదీ వరకు ఆయన ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఓ అంతర్జాతీయ సెమినార్కు హాజరు కానున్నారు. మంత్రి హోదాలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. అంబటి వెంట జల వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ నెల 8వ తేదీన ఆయన మళ్లీ రాష్ట్రానికి తిరిగి వస్తారని తెలుస్తోంది.
ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) కాంగ్రెస్ ఆస్ట్రేలియాలో ఏర్పాటైంది. ఈ నెల 5, 6, 7 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు సదరన్ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ సిటీ ఈ సెమినార్కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఇది 24వ ఐసీఐడీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్. వివిధ దేశాల నుంచి పలువురు ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. సుమారు 35 దేశాల ప్రతినిధులు మంత్రులు ఇందులో పాల్గొంటారని తెలుస్తోంది.

కాగా పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థల నిర్వహణ పెను సవాల్గా మారిందని, దీనికి సంబంధించిన పరిష్కారాన్ని తక్షణమే అన్వేషించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోన్నారు. నీటి ప్రాజెక్టుల నిర్వహణ, వాటి నిర్మాణంపైనా ఇందులో చర్చిస్తారు. వాటి నిర్మాణంలో అనుసరించాల్సిన నిబంధనలు, వినియోగించాల్సిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం.. వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
అలాగే- పర్యావరణానికి హాని కలగని విధంగా గ్రీన్ ఫీల్డ్, ఎకో ఫ్రెండ్లీ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించుకోవాల్సిన అవసరం భవిష్యత్తులో ఏర్పడుతుందని, దీనికి అనుగుణంగా చేపట్టాల్సిన నిబంధనల మార్పులపైనా ఈ ఐసీఐడీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్లో చర్చించే అవకాశం లేకపోలేదు. సుదీర్ఘకాలం మనుగడ సాగించేలా, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలవగలిగేలా భారీ రిజర్వాయర్లు నిర్మించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇందులో చర్చిస్తారని సమాచారం.
ఏపీలో మూడు జల వనరుల ప్రాజెక్టులకు ఐసీఐడీ ఇప్పటికే వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్గా గుర్తింపు ఇచ్చింది. కడప జిల్లాలోని పోరుమామిళ్ల, ప్రకాశం జిల్లాలోని కంభం చెరువులు, కర్నూలు-కడప కెనాల్కు ఈ గుర్తింపు లభించింది. పోరుమామిళ్ల చెరువు-13వ శతాబ్దం, కంభం చెరువు-15వ శతాబ్దం, కేసీ కెనాల్-18వ శతాబ్దంలో నిర్మితం అయ్యాయి.












Click it and Unblock the Notifications