చంద్రబాబుకు బిగుసుకుంటున్న ఉచ్చు.. మాజీ పీఏ డైరీలో సంచలన విషయాలు.. ఢిల్లీలో మంత్రి కొడాలి
ఏపీ, తెలంగాణలో ఐటీ దాడులు, రూ.2వేల కోట్ల అక్రమాస్తుల గుర్తింపు వ్యవహారంలో మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు మెడకు ఉచ్చు మరింత బలంగా బిగుసుకుపోయిందని మంత్రి కొడాలి నాని చెప్పారు. వైసీపీ సర్కారుపై కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్సీల బృందం ప్రయత్నిస్తున్న సమయంలోనే మంత్రి కొడాలి ఢిల్లీలో పర్యటిస్తూ పలువురు కీలక నేతల్ని కలిసిన తర్వాత.. చంద్రబాబు ఫ్యూచర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
పీఏ డైరీలో అన్నీ ఉన్నాయి..
ఐటీ దాడుల్లో పట్టుపడిన రూ.2వేల అక్రమ ఆస్తుల కేసులో చంద్రబాబును కాపాడుకునేందుకు ఢిల్లీ కేంద్రంగా టీడీపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోందని, అయితే పచ్చిగా దొరికిపోయిన పచ్చదొంగకు సాయం చేసేందుకు ఇక్కడెవరూ ముందుకు కావడంలేదని మంత్రి కొడాలి అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నిర్మాణ సంస్థల ద్వారా పాల్పడిన అక్రమాలకు సంబంధించిన విషయాలన్నీ మాజీ పీఏ శ్రీనివాస్ డైరీలో రాసున్నాయని, టీడీపీ అధినేత తప్పించుకునే అవకాశమేలేదని ఆయన చెప్పారు.

అంత పిచ్చోడేం కాదు..
‘‘మాజీ పీఏ ఇంట్లో రూ.2లక్షలు దొరికితే, దాన్ని రూ.2వేల కోట్లుగా వైసీపీ ప్రచారం చేస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. నిజమే, బుద్ధి ఉన్న ఏ సన్నాసి కూడా ఇంట్లో రూ.2వేల కోట్లు దాచుకోడు. అలా చెయ్యడానికి చంద్రబాబు పిచ్చోడేమీకాదు. ప్రెస్ మీట్ లో సూట్ కేసులు చూపించి, ఇందులో అంత డబ్బు పడుతుందా? అని టీడీపీ నేతలు అడుగుతుండటం చాలా కామెడీగా ఉంది.

బాబు ఫ్యూచర్ ఇదే..
మాజీ సీఎం చంద్రబాబు అక్రమ సంపాదనలో ఈ రూ.2వేల కోట్లు చాలా చిన్న అమౌంట్. వాటికి సంబంధించిన ఆస్తులు, నగదు, డాక్యుమెంట్ల వివరాలతోపాటు చంద్రబాబు చెప్పిన మేరకు ఎవరెంత డబ్బులు ఇచ్చింది మాజీ పీఏ శ్రీనివాస్ డైరీలో తన డైరీలో రాసుకున్నారు. బాబు ఫ్యూచర్ కచ్చితంగా జైలే.. చేసిన అక్రమాలకు ఆయన శిక్ష అనుభవించక తప్పదు''అని మంత్రి కొడాలి నాని అన్నారు.
పాశ్వాన్ తో భేటీ..
ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి కొడాలి మంగళవారం కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ను కలిశారు. ఏపీలో పౌరసరఫరాలకు సంబంధించిన పలు సమస్యలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లారు. ఈ భేటీలో రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పాశ్వాన్ తోపాటు బీజేపీకి చెందిన పెద్దల్ని కూడా మంత్రి నాని కలవబోతున్నట్లు సమాచారం. మరోవైపు..

టీడీపీకి షాక్..
ఏపీలో శాసన మండలి రద్దు, దానికి ముఖ్యకారణమైన మూడు రాజధానుల ఏర్పాటు అంశాల్లో వైసీపీ సర్కారు, సీఎం జగన్ తీరుపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్సీల బృందం మంగళవారం ఢిల్లీలో అడుగుపెట్టారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవాలనుకున్నప్పటికీ అపాయింట్ మెంట్ దక్కలేదు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక్కరే టీడీపీ ఎమ్మెల్సీలకు టైమిచ్చారు.












Click it and Unblock the Notifications