వంగవీటి రాధ హత్యకు రెక్కీ అంశంపై తీవ్రంగా స్పందించిన కొడాలి నాని: రాంగోపాల్ వర్మపైనా ఫైర్
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా హత్యకు రెక్కీ అంశంపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. తన హత్యకు రెక్కీ జరిగిందని తన సమక్షంలో రాధా అన్నారని, అందుకే తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించి రాధాకు సెక్యూరిటీ ఇప్పించారని, విచారణకు కూడా ఆదేశించారని కొడాలి నాని చెప్పారు.
వంగవీటి రాధ హత్యకు రెక్కీ అంశంపై కొడాలి నాని తీవ్ర స్పందన
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దీన్ని రాజకీయంగా లబ్ది పొందాలని చూశారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారని ఆరోపించారు. 'నా పార్టీ వేరు రాధా పార్టీ వేరు.. కానీ అతనికి హాని ఉంటే కాపాడాలని అనుకుంటాం. చంద్రబాబు రంగాని పొట్టన పెట్టుకున్న వ్యక్తి. మళ్లీ వాళ్ల ఇంటికి వెళ్లాడు. చంద్రబాబు డైరెక్షన్లోనే రంగా హత్య జరిగింది. ఈ వ్యవహారంలో నాపై విమర్శలు వచ్చాయని నేను అనుకోను. రాజకీయాల్లో విమర్శలు సహజం. చంద్రబాబు ఎయిడ్స్ లాంటి వాడు. రాజకీయ వ్యభిచారం చెయ్యడం అలవాటు' అని కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు.
రాంగోపాల్ వర్మను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న కొడాలి నాని
ఇక, ఏపీలో సినిమా టికెట్ల ధరలపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. 'పక్క రాష్ట్రంలో ఉండి రాంగోపాల్ వర్మ ఏమైనా మాట్లాడతాడు. పక్క రాష్ట్రంలో, ఇతర దేశాల్లో ఉండే వాళ్లని మేము పట్టించుకోము. సినిమా టికెట్లపై మా వైఖరి ఒక్కటే' అని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.
నా మాటలే: రాంగోపాల్ వర్మకు నాగబాబు మద్దతు
ఇది ఇలావుండగా, ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై ప్రభుత్వానికి పది ప్రశ్నలు సంధించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ప్రముఖ నటుడు నాగబాబు మద్దతు లిపాకరు. రామ్గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఏపీలో టికెట్ల ధరలపై స్పందించిన విషయం తెలిసిందే. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశిస్తూ.. 10 ప్రశ్నలు సంధించారు. అయితే ఈ ప్రశ్నలపై మెగా బ్రదర్ నాగబాబు మద్దతు తెలపడం గమనార్హం. ఏపీ మంత్రికి ఆర్జీవీ 10 ప్రశ్నలతో కూడిన ట్విట్ చేశారు. అయితే ఈ ట్విట్ను నాగబాబు రీట్వీట్ చేస్తూ.. మీరు చెప్పింది అక్షరాలా నిజమన్నారు. అంతేగాక, నాగబాబు అడుగుదామనుకున్న ప్రశ్నలనే ఆర్జీవీ అడిగారంటూ వెల్లడించారు.