లండన్లో మంత్రి లోకేష్ రోడ్ షో.. హాజరుకానున్న 150కి పైగా గ్లోబల్ సీఈఓలు !
ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా కూటమి సర్కారు కృషి చేస్తోంది. ఈ ఏడాది నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా "పార్టనర్ షిప్ సమ్మిట్-2025" ను నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ లండన్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. ఇందుకు గాను వినూత్న రీతిగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఉన్నతస్థాయి రోడ్ షో నిర్వహిస్తున్నారు.
లండన్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరక్టర్స్, పాల్ మాల్ కన్వెన్షన్ సెంటర్లో భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు ఈ రోడ్ షో ప్రారంభమవుతుంది. ఈ కీలక సమావేశంలో యూకే డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, టెక్ మహీంద్రా యూరప్ విభాగం అధ్యక్షుడు హర్షూల్ అస్నానీ, ఐసీఐసీఐ బ్యాంకు యూకే సీఈఓ రాఘవ్ సింఘాల్, ఏపీఐఐసీ వైస్ చైర్మన్ అభిషిక్త్ కిశోర్ వంటి ప్రముఖులు పాల్గొననున్నారు. వీరితో పాటు గ్లోబల్ ఫండ్స్, తయారీ, సేవా రంగాలకు చెందిన సుమారు 150 మంది సీఈఓలు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే స్పీడ్ ఆఫ్ డూయింగ్.. గురించి పెట్టుబడిదారులకు వివరించనున్నారు. గత 15 నెలల్లో రాష్ట్రానికి రూ.10,06,799 కోట్ల విలువైన 122 భారీ ప్రాజెక్టులు వచ్చిన విషయాన్ని సైతం ప్రస్తావించనున్నారు. పరిశ్రమల కోసం లక్ష ఎకరాలతో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు సహా పలు కీలక నిర్ణయాల గురించి తెలియజెప్పనున్నారు.
అంతే కాకుండా రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలపై.. లోకేష్ ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. హిందూజా, రోల్స్ రాయిస్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం అవుతారని సమాచారం. పోర్టు ఆధారిత పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్నోవేషన్, ఆధునిక తయారీ రంగాల్లో ఉన్న అవకాశాలను చర్చించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఎరిక్సన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సైయంట్, లండన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి సంస్థల ప్రతినిధులు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. దీంతో ఈ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.












Click it and Unblock the Notifications